యాక్సిస్ మై ఇండియా కాదు.. యాక్సిస్ తుస్ ఇండియా!!

యాక్సిస్ మై ఇండియా కాదు.. యాక్సిస్ తుస్ ఇండియా!!

యాక్సిస్ మై ఇండియా.. ఇప్పుడీ పేరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండియా వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. ఎందుకంటే.. పేరుకే ఇది జాతీయ సర్వే సంస్థ కానీ చేసేవి అన్నీ బోగస్ అని తాజాగా తేలిపోయింది. జాతీయ మీడియాలో పేరుగాంచిన ఇండియా టుడేటో కలిసి ఈ సర్వేలో ఎక్కడా వాస్తవాలకు దగ్గరగా ఎక్కడా లేకపోవడంతో ఆయా రాష్ట్రాల పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ఇక సర్వే ఫలితాలు చెబుతుండగానే.. సదరు సంస్థ అధినేతను ఇండియా టుడే ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్ నిలదీసిన పరిస్థితి నెలకొంది అంటే పరిస్థితి ఎలా ఉందో..? ఎంతవరకూ యాక్సిస్ మై ఇండియా సర్వేను నమ్మవచ్చు అనేది అర్థం చేసుకోవచ్చు. 

అన్నీ అట్టర్ ప్లాప్స్!

ఒక్కసారి యాక్సిస్ మై ఇండియా చేసిన సర్వేలు ఒక్కటంటే ఒక్కటీ గెలిచిన సందర్భాలు లేనే లేవని గత అనుభవాలు చెబుతున్నాయి. 2023 లో ఛత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ ఘన విజయం సాధిస్తుందని చెప్పగా బీజేపీ విజయం సాధించిన పరిస్థితి. ఇక రాజస్థాన్ విషయానికి వస్తే 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పిన ఇదే సర్వే సంస్థ.. సీన్ కట్ చేస్తే అట్టర్ ప్లాప్ అయ్యి.. బీజేపీ గెలిచి నిలిచింది. ఇక ఇంకాస్త లోతుగా వెళ్తే.. 2021 సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కమలం వికసిస్తుందని అంచనా వేశారు కానీ తృణముల్ కాంగ్రెస్ గెలిచింది. చూశారు కదా మూడంటే మూడు సర్వేలు చేయగా.. ఒక్కటంటే ఒక్కటీ నిజం అయ్యిందా అంటే అబ్బే అస్సలు కానే కాలేదు. ఇలా చెప్పుకుంటే చాలానే ఉన్నాయి.

యాక్సిస్ మై ఇండియా కాదు.. యాక్సిస్ తుస్ ఇండియా!!

ఏపీ.. ఎలా నమ్మాలి..?

ఇక ఏపీ విషయానికి వస్తే.. అధికారంలో ఉన్న వైసీపీకి కేవలం 2 నుంచి 4 మాత్రమే పార్లమెంట్ సీట్లు వస్తాయని చెప్పింది. ఒక్క రాయలసీమ అది కూడా ఉమ్మడి కడప జిల్లాలోనే రెండు స్థానాలు రాజంపేట, కడప లోక్ సభ స్థానాల్లో గెలుస్తుంది.. అలాంటిది ఇక ఎక్కడా కూడా గెలిచే ఛాన్స్ లేదని చెప్పడంతో యాక్సిస్ సర్వే తుస్ అని తేలిపోయింది. అది కూడా వైసీపీ గుర్తు చీపురు అని చెప్పడం ఎంత నమ్మశక్యం అనేది తెలుస్తుంది. ఇక కూటమికి 21 నుంచి 23 ఎంపీ స్థానాల్లో కూటమి గెలుస్తుందని చెప్పడం బీజేపీ, టీడీపీ, జనసేన నేతలే నమ్మకపోవడం గమనార్హం. ఇవన్నీ చూస్తే.. అసలు ఈ సంస్థ సర్వే చేసిందా లేకుంటే.. స్టూడియోలో కూర్చొని ఏదో వేళ్ళ మీద లెక్కెట్టి చెబుతోందా..? అన్నది అర్థం చేసుకోవచ్చు. పోనీ ఎన్ని నియోజకవర్గాలల్లో సర్వే చేసింది..? ఎన్ని శాంపిల్స్ తీసుకుంది..? అన్నది ఎక్కడా లేకపోవడంతో లేనిపోని సందేహాలు వస్తున్నాయి. పోనీ ఇప్పటి వరకూ వచ్చిన సర్వేలకు దరిదాపుల్లో కూడా లేకపోవడంతో ఏపీ ప్రజలు ఎలా నమ్ముతారు..? అసలు సిసలైన ఫలితాలు వచ్చేవరకూ వేచి చూడాలి మరి.