రంగంలోకి దిగిన ‘మా’

రంగంలోకి దిగిన 'మా'

2 రోజుల కిందట మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు మాస్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హీరోహీరోయిన్లు, టెక్నీషియన్లు, సినీ జనాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసే సోషల్ మీడియా వాళ్లు.. 48 గంటల్లో వాటిని తొలిగించాలని, లేకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించాడు.

చెప్పినట్టుగానే మంచు విష్ణు రంగంలోకి దిగాడు. ఈరోజు 5 యూట్యూబ్ ఛానెల్స్ ను నిషేధించాడు. కొంతమంది నటులు, వాళ్ల కుటుంబ సభ్యులపై అభ్యంతరక పోస్టులు చేసిన 5 యూట్యూబ్ ఛానెళ్లను టెర్మినేట్ చేశారు.

టెర్మినేట్ అయిన యూట్యూబ్ ఛానెళ్లలో ట్రోల్స్ రాజా, హైదరాబాద్ కుర్రాడు లాంటివి ఉన్నాయి. ఇకపై ఈ 5 యూట్యూబ్ ఛానెల్స్ లో ఎలాంటి పోస్టులు పెట్టలేరు. అంతేకాదు, వీటిపై లీగల్ గా కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధమౌతోంది అసోసియేషన్.

ఓ చిన్నారిపై సోషల్ మీడియాలో హనుమంతు అనే యూట్యూబర్ అత్యంత జుగుప్సాకరంగా వీడియో పోస్టు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై మందుగా సాయిధరమ్ తేజ్ స్పందించగా.. ఆ తర్వాత చాలామంది సెలబ్రిటీలు రియాక్ట్ అయ్యారు. దీంతో తెలంగాణ పోలీసులు అతడిపై కేసుపెట్టారు. ప్రస్తుతం అతడు కస్టడీలో ఉన్నాడు. ఈ క్రమంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ తరఫున కూడా చర్యలకు దిగారు మంచు విష్ణు.