కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

కల్యాణ రాముడు చిత్రంలో నటించిన బామ్మ ఇక లేరు..

దక్షిణాది సినిమాల్లో నటించి మెప్పించిన సీనియర్‌ నటి ఆర్‌.సుబ్బలక్ష్మి (87) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సుబ్బలక్ష్మి కొచ్చిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని స్వయానా ఆమె మనవరాలు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. తన బలమైన.. తన అమ్మమ్మను కోల్పోయానంటూ సుబ్బలక్ష్మి మనవరాలు పోస్ట్ పెట్టారు.

పండు వృద్ధురాలు అయినప్పటికీ సుబ్బలక్ష్మికి సినిమాలపై మక్కువ పోలేదు. 80 ఏళ్ల వయసులో సైతం పలు సినిమాల్లో నటించి మెప్పించారు. తెలుగులో కల్యాణ రాముడు, ఏ మాయ చేసావె వంటి సినిమాల్లో కనిపించి మెప్పించారు. తెలుగు,తమిళ, మాలయాళ భాషల్లో మొత్తం 70కు పైగా చిత్రాల్లో నటించారు. చివరిగా బీస్ట్ సినిమా చేశారు. అంటే ఆమెకు 87 ఏళ్ల వయసు వచ్చే వరకూ కూడా నటిస్తూనే ఉన్నారు. 

Advertisement

ఇక సుబ్బలక్ష్మి బుల్లితెరపై కూడా పలు సీరియల్స్‌లో నటించారు. సంగీతం, నాట్యంలోనూ నిపుణురాలైన సుబ్బలక్ష్మి సినిమాల్లోకి రావడానికి ముందు ఎంతోమందికి వీటిలో శిక్షణ ఇచ్చారు. జవహర్‌ బాలభవన్‌లో సంగీత, నాట్య శిక్షకురాలిగా పనిచేశారు. 1951లో ఆల్‌ ఇండియా రేడియోలో ఉద్యోగినిగా.. సినిమాల్లో డబ్బింగ్ ఆర్టిస్టుగా రాణించారు. అంతేకాదు.. దక్షిణ భారత దేశం నుంచి ఆల్‌ ఇండియా రేడియోలో పనిచేసిన తొలి లేడీ కంపోజర్‌గా సుబ్బలక్ష్మి రికార్డు సృష్టించారు.