గద్దర్ ప్రాణం పోయే వరకూ.. చివరకు ఆసుపత్రిలో సైతం పాటలు వినిపిస్తూనే..!

గద్దర్ ప్రాణం పోయే వరకూ.. చివరకు ఆసుపత్రిలో సైతం పాటలు వినిపిస్తూనే..!

పొడుస్తున్న పొద్దుమీద అంటూ.. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తుకు తీసుకెళ్లిన ఆ గళం మూగబోయింది. అమ్మా తెలంగాణమా అంటూ ఆకలి కేకలను వినిపించిన పొద్దు వాలిపోయింది. ఎన్నో పాటలతో.. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన ఆ ఊపిరి ఆగిపోయింది. గుమ్మడి విఠల్‌ అలియాస్‌ గద్దర్‌ (74) ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు అపోలో ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. చివరకు ఛాతినొప్పితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్న సమయంలో కూడా గద్దర్‌ పాటలు పాడి వినిపించారని వైద్యులు చెప్పారు. ఆదివారం ఒక్కసారిగా పరిస్థితి ఆందోళనకరంగా మారిందని.. తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకపోయిందన్నారు.

వ్యక్తిగత జీవితం..

గద్దర్ 1975లోబ్యాంకు ఎగ్జామ్ రాసి కెనరా బ్యాంకులో క్లర్క్‌గా చేరారు. అనంతరం విమల అనే యువతిని పెళ్లాడారు. వీరికి ముగ్గురు సంతానం. అంతా బాగుందనుకన్న సమయంలో అంటే 1984లో ఆయన ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమ బాట పట్టారు. జన నాట్యమండలిలో చేరి ప్రజలను చైతన్యం చేసే కార్యక్రమాలను చేపట్టారు. ఒగ్గు కథ, బుర్ర కథ, ఎల్లమ్మ కథల ద్వారా గ్రామీణ ప్రజల్లోకి వెళ్ళారు. ఒక తెలుగు రాష్ట్రంలోనే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిషా, బీహార్ రాష్ట్రాల్లో కూడా ప్రదర్శనలు ఇచ్చారు. 

శరీరంలోకి దూసుకెళ్లిన బుల్లెట్లు..

1997 ఏప్రిల్ 6న గద్దర్‌పై తుపాకీలు తమ ప్రతాపం చూపించాయి. పోలీసులు తుపాకీలతో విరుచుకుపడ్డారు. నిజానికి ఆయన అప్పుడే జీవించడం కష్టమని భావించారు. వెంటనే వైద్యులు శస్త్ర చికిత్స నిర్వహించి ఒక బుల్లెట్ మినహా అన్నింటినీ తొలగించారు. ఆ ఒక్క బుల్లెట్ వెన్నెముకలో ఇరుక్కుపోవడంతో దాన్ని తొలగిస్తే ప్రాణాలకే ప్రమాదమని భావించిన వైద్యులు దాన్ని శరీరంలో అలాగే వదిలేశారు. ఆయన ఒంట్లో ఇప్పటికీ ఆ బుల్లెట్ ఉందన్న విషయం చాలా మందికి తెలుసు. 

గద్దర్ ప్రాణం పోయే వరకూ.. చివరకు ఆసుపత్రిలో సైతం పాటలు వినిపిస్తూనే..!

గద్దర్ స్థాపించిన పాఠశాలలోనే..

ప్రత్యేక తెలంగాణ విషయంలో గద్దర్ చాలా అసంతృప్తితో ఉండేవారు. ప్రత్యేక తెలంగాణ ద్వారా నెరవేరింది ప్రజల వాంఛ కాదని.. దొరల వాంఛ అని పలు సందర్భాల్లో ఆయన పేర్కొన్నారు. దేనికోసమైతే తెలంగాణ తెచ్చుకున్నామో అవేమీ రాలేదనేవారు. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఎంతగానో శ్రమించిన ప్రజా యుద్ధనౌక అస్త్ర సన్యాసం చేసింది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు గద్దర్‌ స్థాపించిన మహాబోది పాఠశాలలో ఆయన అంత్యక్రియలు ప్రభుత్వ అధికారిక లాంఛనాల నడుమ జరగన్నాయి.