ఆంధ్ర రాష్ట్రం అప్పుల కుప్ప అన్న పురందేశ్వరి.. ఏది నిజం.. ఏది ఆరోపణ..?

ఆంధ్ర రాష్ట్రం అప్పుల కుప్ప అన్న పురందేశ్వరి.. ఏది నిజం.. ఏది ఆరోపణ..?

ఏపీలో రాష్ట్రం ఏర్పడే నాటికి ఉన్న అప్పులు రూ.97,000 కోట్లు అప్పులు ఉన్నాయని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అన్నారు. 2019 మార్చి 31 నాటికి, చంద్రబాబు దిగిపోయేనాటికి ఏపీ మీద ఉన్న అప్పు : 3,62,375 కోట్లు అని.. అంటే ఐదేళ్ళలో చంద్రబాబు చేసిన అప్పు : 2,65, 365 కోట్లు అని ఆమె తెలిపారు. ఆ తరువాత వైసీపీ అధికారంలోకి రాగా 18 జులై 2023 నాటికీ ఏపీ అప్పు : 10,77,006 కోట్లు అని.. అంటే వైసీపీ చేసిన అప్పు : 7,14,631 కోట్లు అని పురందేశ్వరి వెల్లడించారు. అయితే దీనిలో నిజమెంత? ఆరోపణలు ఎన్ని? అనేది ఆసక్తికరంగా మారింది.  

వాస్తవాలు : 

రాష్ట్ర విభజననాటికి ఉన్న అప్పు : 1,32,079 కోట్లు 

టీడీపీ దిగిపోయేనాటికి రాష్టం అప్పులు : 3,,31,054 కోట్లు (వార్షిక పెరుగుదల 20. 17 శాతం )

2023 మార్చ్ నాటికి ఏపీ అప్పులు : 5,87,317 కోట్లు ( 16. 13 శాతం )

రాష్ట్ర విభజన నాటికి ప్రభుత్వ రంగ సంస్థల అప్పులు : 1,53, 346 కోట్లు 

టీడీపీ దిగిపోయేనాటికి ఉన్న అప్పులు : 4,12,288 కోట్లు ( వార్షిక పెరుగుదల 21. 87 శాతం) 

2023 మార్చి నాటికి అప్పులు : 6,51,789 కోట్లు 

టీడీపీ పాలనతో పోలిస్తే సీఎం వైయస్ జగన్ ప్రభుత్వం చేస్తున్న అప్పులు తక్కువేనని కాగ్ చెబుతోంది. అదే సమయంలో మూలధన వ్యయం చాలా ఎక్కువ అని కాగ్ నివేదిక స్పష్టం చేస్తోంది. చంద్రబాబు హయాంలో ఐదేళ్ళలో రూ. 76,139 కోట్లు ఖర్చు చేశారు. అంటే సరాసరి ఏడాదికి రూ.15,225 కోట్లు కాగా జగన్ సీఎం అయ్యాక నాలుగేళ్లలోనే రూ.75,411 కోట్లు ఖర్చు చేశారు. అంటే సరాసరి ఏడాదికి రూ.18,852 కోట్లు .. సామాజిక ఆస్తుల పెంపునకు ఖర్చు చేసినట్లు లెక్క . 

ఇక పురందేశ్వరి రాష్ట్రంలో రోడ్ల పరిస్థితిపై మాట్లాడుతూ.. ఏమాత్రం బాగోలేవన్నారు. అయితే వాస్తవానికి టీడీపీ జమానాలో రోడ్లకు పెట్టిన ఖర్చు : రూ.3,160 కోట్లు కాగా..

జగన్ ప్రభుత్వం వచ్చాక నాలుగేళ్లలో రోడ్లకు పెట్టిన ఖర్చు : రూ.4,493 కోట్లు కావడం గమనార్హం. 

ఉద్యోగులకు సకాలంలో జీతాలు అందడం లేదని పురందేశ్వరి ఆరోపించారు. అయితే నిజానికి బీజేపీ పాలనలోని మధ్యప్రదేశ్ జీతాల బిల్లు : రూ.23,997 కోట్లు ( 2021-22 ఏప్రిల్ – అక్టోబర్ వరకు ), గుజరాత్ : రూ.7,789 కోట్లు.. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ జీతాల బిల్లు : 24, 681 కోట్లు కావడం గమనార్హం. (2018–19లో ఉద్యోగుల జీతాలు,పెన్షన్ల చెల్లింపులకు రూ.53,811 కోట్లు.. అలాగే 2020-21లో ఉద్యోగుల జీతాలు,పెన్షన్ల చెల్లింపులకు రూ.66,470 కోట్లు )

ఇన్ని సమస్యల నడుమ.. చంద్రబాబు వదిలేసి వెళ్లిన జెన్- కో బిల్లులు, కాంట్రాక్టర్ల బిల్లుల వంటివి ఎప్పటికప్పుడు క్లియర్ చేస్తూనే ప్రజలకు వివిధ పథకాల ద్వారా నేరుగా రూ.2.20 లక్షల కోట్లను ప్రజల ఖాతాల్లోకి జమచేశారని వైసీపీ అభిమానులు, కార్యకర్తలు లెక్కలు తీసి మరీ చెబుతున్నారు. ‘కరోనా వంటి కష్టకాలంలో రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గినా ఏక్కడా ఏ పథకమూ ఆగలేదు.. ఏ వర్గమూ ఇబ్బంది పడలేదు.. ఇవన్నీ కనబడలేదా కొత్త బీజేపీ ప్రెసిడెంట్ గారూ!!’ అని సోషల్ మీడియా వేదికగా పురందేశ్వరిని వైసీపీ ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు.