బీజేపీతో టీడీపీ పొత్తుకు అడ్డంకిగా సీట్లు..

బీజేపీతో టీడీపీ పొత్తుకు అడ్డంకిగా సీట్లు..

బీజేపీ, టీడీపీల మధ్య పొత్తు దాదాపు ఖరారైనట్టుగానే తెలుస్తోంది. ఇక ఈ రెండు పార్టీల మధ్య సీట్ల అంశమే కాస్త అడ్డంకిగా మారింది. దీనిని దాటేశారో ఇక అభ్యర్థులను ప్రకటించేసుకుని ముందుకు వెళ్లడమే. ఏపీలో బీజేపీకి ఏమాత్రం పట్టు లేదు. సొంతంగా బరిలోకి దిగితే డిపాజిట్లు దక్కడం కూడా కష్టమే. అలాంటి బీజేపీకి ఆశలు భారీగానే ఉన్నాయని సమాచారం. శక్తికి మించిన సీట్లను బీజేపీ కోరుతోందట. బీజేపీ లేకుంటే శక్తవంతమైన వైసీపీని ఢీకొట్టడం కష్టమని టీడీపీ భావిస్తోంది.

అయితే టీడీపీ అధినేత చంద్రబాబుకు తమ పార్టీ సీనియర్లు పొత్తు విషయమై కొన్ని సూచనలు అయితే చేసినట్టుగా తెలుస్తోంది. ఇష్టానుసారంగా పొత్తులకు అంగీకరించవద్దని.. పొత్తు ఉభయతారకంగా ఉంటేనే ఓకే చెప్పాలని తెలిపారట. ఇప్పటికే పొత్తులో భాగంగా జనసేనకు దాదాపు 30 సీట్లు వెళ్లిపోయాయని.. ఇక బీజేపీకి సైతం కోరినన్ని సీట్లు ఇస్తే టీడీపీలోని పలువురు నేతల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని.. దీంతో మొదటికే మోసం వస్తుందని సూచించారట.

పార్టీ నేతల సూచనల తర్వాత బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు, 3 ఎంపీ స్థానాలు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారట. కానీ బీజేపీ మాత్రం భారీగానే కోరుతోందట. 25 అసెంబ్లీ, దాదాపు 8 ఎంపీ స్థానాలు కోరుతోందట. అన్ని ఇస్తే టీడీపీలో ఇబ్బందులు తప్పవు. కాబట్టి చంద్రబాబు అయితే ఈ సీట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారట.నేడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఇది పూర్తైతే కానీ క్లారిటీ వచ్చే అవకాశం లేదు.