సీటు పోటు: బాబు ఇచ్చారు, పవన్ పుచ్చుకున్నారు!

బాబు ఎత్తు.. పవన్ చిత్తు చిత్తు

చెప్పేది శ్రీరంగ నీతులు.. దూరేది ఏదో అని ఎన్ని నీతులు మాట్లాడినా ఏం చెప్పినా సరే.. టీడీపీ అధినేత చంద్రబాబు చేసేది మాత్రం వేరుగా ఉంటుంది. ఇరు పార్టీలు పొత్తుతో ముందుకు వెళ్లినప్పుడు సమ న్యాయం పాటించాలి. కానీ చంద్రబాబు మాత్రం ఎటు పోయి.. ఎటొచ్చినా తన పార్టీకి లబ్ది చేకూరేలా పొత్తులు ఉండేలా చూసుకున్నారు. చంద్రబాబు జైల్లో ఉన్న సమయంలో ఆయనకు అండగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిలవడమే కాదు.. ఆ పార్టీతో పొత్తు కూడా పెట్టుకున్నారు. ఇలాంటి జనసేన విషయంలో చంద్రబాబు ఇంకెంత నిబద్దతతో ఉండాలి? ఇవాళ పొత్తు ప్రకటనతో ఆయనలో ఏ పాటి నిబద్దత ఉందో అర్థమవుతుంది.19 స్థానాల సంగతేంటి?

సీటు పోటు: బాబు ఇచ్చారు, పవన్ పుచ్చుకున్నారు!

ఇన్నాళ్లుగా జనసేనతో పొత్తు అంటూ పవన్, కాపుల బలాన్ని వాడుకునేందుకు ప్లాన్ వేసిన చంద్రబాబు జాబితా ప్రకటనరోజు తన నిజరూపాన్ని బయటపెట్టారు తొలివిడతలో మొత్తం 95 సీట్లకు చంద్రబాబు అభ్యర్థులను ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే తమ పార్టీ జనసేనకు 24 సీట్లు దక్కినట్టు పవన్ వెల్లడించారు. ఇక్కడే అసలు మతలబు ఉంది. అయితే తెలుగుదేశం వాటా కింద వచ్చిన 94 స్థానాలకూ అభ్యర్థుల పేర్లను సైతం ప్రకటించారు.. కానీ జనసేన వాటాలోని 24 సీట్లలో కేవలం ఐదుగురిని మాత్రమే పేర్లు ప్రకటించారు. మరో 19 స్థానాల సంగతి పక్కనబెట్టేశారు. అంటే అక్కడ కూడా చంద్రబాబు సూచించినవాళ్లనే జనసేన తరఫున పోటీ చేయిస్తారా? అనేది చర్చనీయాంశంగా మారింది.

పవన్ పేరును ప్రకటించుకోలేదు..

ఇక జనసేన, టీడీపీ కూటమి ఇంకా 57 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వాటిలో జనసేనకు ఎన్ని ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది. మొత్తానికి పవన్ కళ్యాణ్‌కే కాకుండా కాపులకు సైతం చంద్రబాబు మరోసారి పోటు పొడిచినట్లే క్యాడర్ భావిస్తోంది. ఇదిలా ఉండగా టీడీపీ ప్రకటించిన సీట్లలో చంద్రబాబు.. అచ్చెన్నాయుడు.. యనమల.. నారా లోకేష్, బాలకృష్ణ వంటి ప్రముఖుల పేర్లు ఉన్నాయి.. కానీ జనసేన తరఫున ఐదుగురి పేర్లు చెప్పినా వాటిలో పవన్ పేరు లేదు.. అంటే అయన ఎక్కడ పోటీ చేస్తారన్నది చెప్పలేదు. ఆఖరుకు జనసేనాని పవన్ కళ్యాణ్ తన సీటు తాను ప్రకటించుకోలేని స్థితిలో ఉన్నారన్నమాట. ఈ క్రమంలోనే పొత్తుకు సిద్ధమై చంద్రబాబుకు తలొగ్గారని జనసైనికులు, పార్టీ మద్దతుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.