ధైర్యంలేని బాబు… బీజేపీ పొత్తుకి ఆరాటం

టీడీపీ, జనసేనలు 99 మందితో కూడిన అభ్యర్థుల జాబితాను విడుదల చేశాయి. చాలా రోజుల పాటు సస్పెన్స్‌లో పెట్టిన మీదట చివరకు తొలి జాబితాను అయితే విడుదల చేశారు. అయితే బీజేపీ కోసం మాత్రం కొన్ని స్థానాలను అట్టే పెట్టి ఉంచారు. అసలు బీజేపీ కోసం టీడీపీ అధినేత చంద్రబాబు ఎందుకు అంతలా వెంపర్లాడుతున్నారనేది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఏమాత్రం ఏపీలో సత్తా చాట లేని బీజేపీ కోసం ఎన్ని సీట్లైనా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని టాక్.

ఎంత మంది తమ పార్టీ నేతల జీవితాలనైనా ఫణంగా పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారు? ఎందుకలా? అసలు సొంతంగా పోటీ చేస్తే డిపాజిట్లు కూడా సాధించలేని బీజేపీ కోసం అంత త్యాగమెందుకు? అసలు ఏం చేయాలని బీజేపీ ప్రాపకం కోసం ఇంతలా చంద్రబాబు ఆరాటపడుతున్నాడని ఆశ్చర్యపోతున్నారు. పార్టీలో సైతం వ్యతిరేకత వెల్లువెత్తుతోంది. పార్టీ నేతలు తమ స్థానాలను ఏమాత్రం బలం లేని బీజేపీకి కట్టబెట్టడంపై గుర్రుగా ఉన్నారు. ఇంతమంది ఆగ్రహాన్ని మూటగట్టుకుని మరీ చంద్రబాబు.. బీజేపీకి సీట్లను కట్టబెట్టేందుకు సిద్ధపడుతున్నారు.

Advertisement
బీజేపీ ప్రాపకం కోసం వెంపర్లాడుతున్న చంద్రబాబు

ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కొన్ని సీట్లు కేటాయించి, జనసేనకి కొన్ని సీట్లు ముష్టి వేసి, బీజేపీ కోసం ఇంకా చంద్రబాబు వెయిట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళని కూడా పొత్తులోకి తీసుకుని వాళ్లకు ఇవ్వడానికి 57 సీట్లు రిజర్వ్ చేసి ఉంచారని టాక్. పట్టున్న జనసేనకేమో 24 సీట్లు.. ఏమాత్రం ఏపీపై పట్టులేని బీజేపీకి 57 సీట్లు కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. సొంతంగా ఎన్నికలకు వెళ్లే దమ్ములేని చంద్రబాబు బీజేపీ ఎన్ని సీట్లు అడిగినా ఇచ్చేలా కనిపిస్తోంది. అసలు ఇదంతా చంద్రబాబు ఎందుకు చేస్తున్నారంటే.. ఒంటరిగా వైసీపీని ఎదుర్కొనే సత్తా లేకనేనని చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. బీజేపీ అండతో ఎలాగైనా గెలవాలనేది చంద్రబాబు యోచన.