మహానగరాలే జలమయం.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు తెలియదా? అంటూ వైసీపీ ఫైర్..

మహానగరాలే జలమయం.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు తెలియదా? అంటూ వైసీపీ ఫైర్.. 

జనాలకు ఏమాత్రం మంచి జరిగినా అది ఎక్కడ నష్టం కలిగిస్తుందోనన్న భావన ప్రతిపక్ష పార్టీలో ఉండటం సహజం. అసలే ఎన్నికల తరుణం ఇలాంటి సమయంలో ప్రతి ఒక్క అవకాశాన్ని అనుకూలంగా మలచుకుంటాయి ప్రతిపక్ష పార్టీలు. ఏపీలో దీనికి భిన్నంగా ఏమీ లదేు. పేదలకు అవసరమైన సౌకర్యాలు.. పథకాలు అందితే తాళలేని టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు జగనన్న లే అవుట్లు పూర్తి అయితే రాజకీయంగా తాము అవుట్ అయిపోతామన్న భయం పట్టుకుందని అంటోంది అధికార పక్షం. అందుకే పేదలకు ఎక్కడ మంచి జరుగుతుందనుకుంటే అక్కడ చేరిపోయి ఇబ్బందులు సృష్టిస్తున్నారని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 

లే అవుట్లు నీళ్లలో మునగడంలో విడ్డూరం ఏముంది?

Advertisement

వారం రోజుల పాటు వరుణ దేవుడు కుంభవృష్టి అయితే కురిపించేసాడు. ఏనాడూ చుక్క నీరు జాడలేని వాగులు సైతం పరవళ్లు తొక్కాయి. ఎండాకాలం పూర్తిగా వట్టిపోయి బావురుమన్న బావులు సైతం తల్లికట్టును దాటి నీళ్లు బయటకు తొణికిసలాడాయి. రెండు రాష్ట్రాల్లోని ఏ ప్రాజెక్టు గేట్లు ఎప్పుడు తెగి  ఊళ్లన్నీ నీళ్లపాలయ్యాయని పాలకులు కళ్ళల్లో వత్తులు వేసుకుని పరిస్థితి కనిపెట్టుకుని ఉన్నారు. అంతెందుకు ఈ వారం రోజుల పాటు కురిసిన వర్షాలకు చంద్రబాబు నిర్మించి ప్రపంచ పటంలో పెట్టిన హైదరాబాద్ సైతం నీళ్లపాలయింది. లోతట్టు ప్రాంతాల్లో అయితే కార్లకు బదులు బోట్లు తిరిగాయి. అలాంటప్పుడు సాధారణ లే అవుట్లు నీళ్లలో మునగడంలో విడ్డూరం ఏముంది? కానీ దీనిని కూడా రాజకీయం చేస్తున్న చంద్రబాబు, పవన్‌లపై వైసీపీ నేతలు, కార్యకర్తలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

భాగ్యనగరాన్ని మూసీ ముంచెత్తలేదా ?

‘‘నీళ్లలో కొట్టుకుపోయిన ప్రజలు ఎందరో.. మూగ జీవాలు ఎన్నో.. మునిగిపోయిన వాహనాలు ఎన్నెన్నో.. ఈ పరిస్థితి పవన్ కళ్యాణ్‌కు తెలియదా? 

సినిమా రిలీజ్ పనులు, కలెక్షన్ల లెక్కలు వేసుకుంటూ బిజీగా ఉన్న పవన్ ఈ పరిస్థితిని చూడలేదా..? చూసేందుకు కళ్ళు లేవా ? రెండేళ్ల క్రితం అపార వర్షాలకు మద్రాస్ నగరం ఏమైంది. అత్యంత ప్రణాళికాబద్ధమైన నగరంగా పిలిచే ఐటి సిటీ బెంగళూరులో ఏమైంది..? అందాల ఆగ్రాను యమునా చుట్టుముట్టలేదా  ? భాగ్యనగరాన్ని మూసీ ముంచెత్తలేదా ?  గోదావరి వరదల్లో తడిసి ముద్దవుతున్న లంకగ్రామాల పరిస్థితి కానరాదా ? మరి ఇప్పటికే రోడ్లు, కాలువలు, డ్రైనేజీలు ఇవన్నీ రూపొంది సకల సౌకర్యాలతో తులతూగుతున్న మహానగరాలే కుండపోతకు తట్టుకోలేక నీట మునుగుతున్న తరుణంలో ఏమీ లేని సాధారణ లే అవుట్లు నీళ్లతో కాక.. ఇంకేలా ఉంటాయి? ’’ అంటూ వైసీపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వెళ్లి సినిమాల్లో కుప్పి గంతులు వేసుకోపో!

ఒకసారి కాలనీ రూపొందిన తరువాత ప్రజలు ఒక్కొక్కరుగా ఇల్లు కట్టుకుంటుండగా అక్కడ రోడ్లు, ఎత్తు చేయడం, విశాలంగా రోడ్లు వేయడం.. కాలువలు వేసి వాననీరు పారుదలకు ప్రత్యేక ఏర్పాట్లు చేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతుంది. అవేమీ లేకుండా ఖాళీగా ఉన్న లే అవుట్లో లేదా ఖాళీ భూభాగంలో ఎక్కడైనా వాననీరు నిలవక తప్పదన్నది జగమెరిగిన సత్యమే. అంతెందుకు పవన్ కల్యాణ్ ముచ్చటపడి కొనుక్కున్న ఫామ్‌హౌస్ సైతం ఈ వర్షాలకు నీరు నిండిపోయి.. గుంతలు గోతులతోనే ఉండి ఉంటుందని.. కాబట్టి పరిస్థితులను బట్టి మాట్లాడాలని వైసీపీ నేతలు హితవు పలుకుతున్నారు. యజమాని డబ్బులు ఇచ్చాడు కాబట్టి ఎప్పుడుబడితే అప్పుడు మొరుగుతాను అంటే ఎలా ? అని ప్రశ్నిస్తున్నారు.

ప్రజలు సంతోషంగా ఇళ్లు కట్టుకుంటున్న వేళ.. మధ్యలో ఈ వర్షం వల్ల కాస్త అంతరాయం ఏర్పడింది. ఈ టైమ్‌లో జనసేన కార్యకర్తలు అక్కడికి వెళ్లి వెకిలిగా ఫొటోలు దిగుతూ వాళ్లని బాధపెట్టడమే తప్ప ఏమైనా ప్రయోజనం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. ‘నీ దత్త తండ్రి పేదలకి ఇళ్లు ఇవ్వకముందే సెంటు భూమి.. శ్మశానం అంటూ వెటకారంతో వారిని అవమానించాడు. ఇప్పుడు నువ్వు తయారయ్యావ్. మీరు ఇచ్చేది లేదు.. మెచ్చేది లేదు. ఏమిరా.. మీ వల్ల ఈ రాష్ట్రానికి ఉపయోగం? వెళ్లి సినిమాల్లో కుప్పి గంతులు వేసుకోపో!’ అని వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.