తప్పుడు వార్తలు రాసినందుకు జగన్ సర్కార్ గట్టిగానే ఇచ్చేస్తోందిగా..!

తప్పుడు వార్తలు రాసినందుకు జగన్ సర్కార్ గట్టిగానే ఇచ్చేస్తోందిగా..!

తప్పుడు వార్తలు రాసిన మీడియా సంస్థలపై క్రిమినల్ కేసులు

మనకు నచ్చని పార్టీ అధికారంలో ఉంటే అదేంటో లోకంలో అన్నీ ఘోరాలు.. ఎక్కడ చూసినా అన్యాయాలు కనిపిస్తాయి. అదే మనకు నచ్చిన పార్టీ అధికారంలో ఉందనుకోండి. ఆటోమేటిక్ రాష్ట్రం మొత్తం రామరాజ్యంలా కనిపిస్తుంది. ఇది కేవలం సామాన్య జనానికే కాదు.. మీడియా ఛానళ్లకూ అలాగే అనిపిస్తుంది. ప్రస్తుతం ఏపీలో జరుగుతోంది అదే. 

Advertisement

ఇక తమకు నచ్చని వైయస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉండటంతో కొన్ని ఛానళ్లు.. అడ్డూ అయిపూ లేకుండా కథనాలను వండి వారుస్తోంది. లోకంలో ఎక్కడ ఏది జరిగినా దాన్ని జగన్ మోహన్ రెడ్డికి ముడిపెట్టి ఇష్టానుసారం సొంత పైత్యాన్ని జోడించి కథనాలు వండి వడ్డిస్తున్నారు.

ఆ క్రమంలో నిన్న కొన్ని పత్రికా సంస్థలు కావాలని ఒక సంఘటనను అక్కడికక్కడే ప్లాన్ చేసి అది నిజం అనేలా వార్తగా రూపొందించి జనంలోకి వదిలారు.

ఇలాంటి రాతలను ప్రభుత్వం మాత్రం ఎంతకాలం చూసీచూడనట్టు వదిలేస్తుంది? ఇప్పుడు సీరియస్‌గా తీసుకుంది. ప్రభుత్వం ప్రస్తుతం సదరు మీడియా సంస్థలతో పాటు వార్తలు రాసిన విలేకరుల మీద క్రిమినల్ కేసులు బుక్ చేస్తోంది. ఈమేరకు జిల్లా విద్యాశాఖాధికారి విస్సన్నపేట మండల విద్యాధికారికి ఉత్తర్వులు ఇస్తూ ఆయా వార్తా సంస్థల మీద క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించారు.

హవ్వ.. ఎంత దారుణానికి తెగబడ్డారు ?

వాస్తవానికి విస్సన్నపేట జడ్పి హైస్కులును రూ. 66 లక్షలతో నాడు – నేడు పథకంలో ఆధునీకరించారు. కొత్త బెంచీలు, స్కూల్లో పచ్చదనం. శుభ్రమైన టాయిలెట్లు .. స్కూల్ చూస్తే ముచ్చటపడేలా ఆ స్కూలును తీర్చిదిద్దారు. అయితే ఆ పాఠశాలకు కొత్త భవనాలు, అదనపు వసతులు సమకూరడంతో కొన్ని పాత భవనాలు, అప్పట్లో నిర్మించి శిథిలావస్థకు చేరిన అస్బెస్టాస్ రేకుల భవనాలు వినియోగించకుండా వదిలేశారు.

అయితే ఈ నాలుగు రోజుల వరుస వర్షాలకు ఆ రేకుల భవనాల్లోకి నీరు చేరింది. అయితే సదరు పత్రికావిలేకరులు, ఛానెల్ విలేకరి కలిసి పాఠశాల ప్రారంభానికి ముందే బడి ఆవరణలోకి వెళ్లి అక్కడ ఆడుకుంటున్న పిల్లలను ఆ శిథిలావస్థలో ఉన్న గదిలోకి తీసుకెళ్లి, బలవంతాన కూర్చోబెట్టి ఫోటోలు, వీడియోలు తీసినట్లు అధికారుల విచారణలో తేలింది. అంటే అక్కడ సమస్య ఏమీ లేకున్నా ఉన్నది లేనట్లు చిత్రీకరించి వార్తను రూపొందించి జనంలోకి వదిలారు.

వాస్తవానికి భిన్నంగా, ప్రభుత్వాన్ని అప్రదిష్టపాల్జేసే దురుద్దేశంతో ప్రజల్లోకి వెళ్లిన ఆ వార్తల విషయాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఈమేరకు అక్కడ విచారణ జరిపి, ఆ తప్పుడు కథనాలకు బాధ్యులైన ఈనాడు, ఆంధ్రజ్యోతి మీద క్రిమినల్ కేసులు బుక్ చేసేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.