లిక్కర్‌ కేసులో కవిత అరెస్ట్

Kavitha

సరిగ్గా లోక్ సభ 2024 ఎన్నికల ప్రకటనకు ఒక్క రోజు ముందు సంచలనం. భారతీయ రాష్ట్ర సమితి (బిఆర్ ఎస్) నేత, ఎమ్మెల్సీ కవితను శుక్రవారం అధికారులు అరెస్ట్ చేశారు.

ఈ కేసులో ఇంతకుముందు కవితను ED అధికారులు విచారించారు. శుక్రవారం ఆమెకు అరెస్ట్ వారంట్ ఇచ్చి, ఇంట్లో సోదాలు జరిపి సాయంతరం అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఆమెని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తీసుకెళ్తున్నారు ఈడీ అధికారులు.

Advertisement

ఐతే, కవిత సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్ ఈడీ అధికారులను ట్రాన్సిట్ వారెంట్ లేకుండా ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. సుప్రీం కోర్టులో కేసు నడుస్తుండగా అరెస్ట్ చెయ్యడాన్ని కూడా కేటీఆర్ తప్పు పట్టారు. ఐతే, ఈడీ అధికారులు తాము నిబంధనల ప్రకారం వెళ్తున్నామని ఆమెని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు.

ఢిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మంత్రులను అరెస్ట్ చేసి జైలులో ఉంచారు. సౌత్ గ్రూప్ కి అనుకూలంగా ఆ పాలసీ వచ్చేలా కవిత ప్రయత్నించిందని ఆరోపణలు చాలాకాలంగా ఉన్నాయి. ఈ కేసులో ఆమెని ఇప్పటికే పలుమార్లు విచారించారు. కానీ ఈ కేసులో తాను బాధితురాలిని అంటూ ఆమె సుప్రీంని ఆశ్రయించారు.

దాదాపు పదేళ్లు పాటు తెలంగాణని పాలించిన కేసీఆర్ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. అప్పటి నుంచి బీఆర్ ఎస్ పార్టీకి ఎన్నో సమస్యలు చుట్టుకుంటున్నాయి. ఇప్పుడు కూతురు అరెస్ట్ పెద్ద దెబ్బే.