రోడ్డు ప్రమాదంలో గాయపడిన హీరోయిన్.. వెంటిలేటర్‌పై చికిత్స..

రోడ్డు ప్రమాదంలో గాయపడిన హీరోయిన్.. వెంటిలేటర్‌పై చికిత్స..

హీరోయిన్‌ అరుంధతి నాయర్‌ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. స్థానికులు హుటాహుటిన ఆమెను తిరువనంతపురంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె  ఐసీయూలో చికిత్స పొందుతోంది. తాజాగా అరుంధతి నాయర్ ఓ యూట్యూబ్‌ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ కార్యక్రమం ముగించుకుని సోదరుడితో కలిసి ఇంటికి స్కూటీపై బయలుదేరింది. ఆ సమయంలోనే ఓ కారు ఆమె స్కూటీని ఢీకొట్టింది.

ఈ ఘటనలో అరుంధతితో పాటు ఆమె సోదరుడు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అరుంధతి పరిస్థితి విషమంగా ఉంది. వెంటిలేటర్‌పై ఉంచి ఆమెకు వైద్యులు చికిత్సను అందిస్తున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నటి గోపిక.. అరుంధతి ప్రస్తుతం వెంటిలేటర్‌పై కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోందని.. ఆసుపత్రి చికిత్సలు భరించేంత స్తోమత ఆమె కుటుంబానికి లేదని తెలిపింది.

తాము కొంత సాయమైతే చేశాము కానీ అది సరిపోవడం లేదని.. మీరంతా తోచినంత సాయం చేయాలని కోరుతోంది. బ్యాంకు వివరాలతో సహా ఇన్‌స్టాలో ఈ మేరకు గోపిక పోస్ట్ పెట్టింది. ‘పొంగి ఎలు మనోహర(2014)’ చిత్రంతో అరుంధతి వెండితెరకు పరిచయమైంది. ఆ తరువాత పలు చిత్రంలో నటించింది. విరుమాండికుమ్‌ శివానందికమ్‌, సైతాన్‌, పిస్తా, ఆయిరం పోర్కాసుకల్‌ చిత్రాల్లో హీరోయిన్‌గా నటించింది. ఒక మలయాళ చిత్రంతో పాటు పలు వెబ్ సిరీస్‌ల్లోనూ అరుంధతి నటిస్తోంది.