స్టార్ హీరోలకు పెద్ద చిక్కే వచ్చి పడింది.. ఆ శాఖ ఆదేశాలతో ఇరుకున పడిన సెలబ్రిటీలు

స్టార్‌లకు సినిమాలు ఒక ఎత్తైతే.. యాడ్స్ మీద వచ్చే ఆదాయం మరో ఎత్తు. నిమిషం యాడ్‌లో నటించి కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. కాసేపు సమయం కేటాయిస్తే చాలు.. వారి అకౌంట్‌కు కోట్ల రూపాయలు యాడ్ అవుతాయి. ఈ క్రమంలో సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కు యమ డిమాండ్ ఉంది. ఇక మహేష్ తర్వాతే వేరే ఎవరైనా.. ఈ మధ్య యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) కూడా బాగానే యాక్టివ్ అయ్యాడు. యాడ్స్ ద్వారా కోట్ల రూపాయలు వెనుకేసుకుంటున్నాడు.

ఇక ప్రకటనల జోలికే వెళ్లని నందమూరి నటసింహం బాలకృష్ణ (Balakrishna) సైతం అన్‌స్టాపబుల్ తర్వాత బాగానే యాడ్స్ చేస్తున్నారు. అయితే తాజాగా కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. యాడ్స్ చేసేవారు ఎవరైనా సరే.. ముందుగా తాము ప్రచారం చేసిన ఉత్పత్తులను వాడిన మీదటే.. వాటికి ప్రచారం కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. ఆ ప్రకటన స్పష్టమైన.. సామాన్యులకు సైతం అర్ధమయ్యే భాషలో ఉండాలని తెలిపింది. మరో నిబంధన ఏంటంటే… యాడ్‌లో యాడ్, పార్టనర్‌షిప్, స్పాన్సర్డ్ వంటి పదాలలో ఏదో ఒకటి తప్పనిసరిగా పొందుపరచాలని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

మార్కెట్‌లో కొత్తగా ఏ ప్రొడక్ట్‌నైనా పంపించాలంటే దానికి సరైన ప్రచారం అవసరం. మనలాంటి వారెవరో చెబితే జనాలకు ఎక్కదు. అందుకే పెద్ద పెద్ద సెలబ్రిటీలను బ్రాండ్ అంబాసిడర్‌లుగా నియమించుకుని.. వారికి కోట్లు కుమ్మరిస్తుంటాయి వ్యాపార సంస్థలు. సెలబ్రిటీలు ఏం చెప్పినా చాలు.. జనాలు గుడ్డిగా ఫాలో అయిపోతుంటారన్న ధీమా. ఇది నిజం కూడా లెండి. మరి కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ బోలెడన్నీ నిబంధనలు పెట్టింది కదా.. ఇప్పుడెలా.. అనుకుంటున్నారా? లూప్ హోల్స్ ఉండనే ఉంటాయిగా. ఇలాంటి నిబంధనలు ఎన్ని పెట్టినా వ్యాపార సంస్థల వద్ద అన్ని లూప్ హోల్స్ ఉంటాయి.