మహిళ నిర్మాత వలలో కెమెరా అసిస్టెంట్‌

మహిళ నిర్మాత వలలో కెమెరా అసిస్టెంట్‌

సినీ ఇండస్ట్రీలో మోసాలకు కొదువ లేదు. ఏమరుపాటుగా ఉంటే ఏమైనా జరగొచ్చు. తాజాగా ఒక కెమెరా అసిస్టెంట్.. ఒక మహిళ నిర్మాత చేతిలో దారుణంగా మోసపోయాడు. ఆ తరువాత అసలు విషయం తెలిసి అవాక్కయ్యాడు. వెంకటగిరి ప్రాంతానికి చెందిన పుల్లంశెట్టి నాగార్జున బాబు (35) సినీ ఇండస్ట్రీలో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. అతనికి ఒక మహిళా నిర్మాతతో పరిచయమైంది.

ఒకరోజు నాగార్జున బాబును సదరు మహిళా నిర్మాత తన ఇంటికి డిన్నర్‌కి పిలిచింది. ఆ సమయంలో తాను తన భర్తకు విడాకులు ఇస్తానని.. ఇద్దరం పెళ్లి చేసుకుందామని అతనికి చెప్పింది. నాగార్జున బాబు సైతం దీనికి అంగీకరించాడు. ఇద్దరూ చిలుకూరు బాలాజీ ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇక ఆ తరువాత సదరు మహిళ నిర్మాత అతని నుంచి డబ్బు లాగడం మొదలు పెట్టింది.

Advertisement

మొదట నాగార్జున బాబు నుంచి రూ.18,50,000 తీసుకుంది. అనంతరం తన పేరిట రూ.10 లక్షలను బ్యాంకులో వేయించుకుంది. ఇక ఆ తరువాత నుంచి ఆమె ప్రవర్తనలో  మార్పు వచ్చింది. అప్పుడు నాగార్జున బాబు ఆమె గురించి ఆరా తీసి షాక్ అయ్యాడు. ఆమెకు తనతో కంటే ముందు రెండు పెళ్లిళ్లు అయ్యాయని.. ముగ్గురు పిల్లలు ఉన్నారని తెలుసుకున్నాడు. అంతేకాదు.. ఆమె గతంలో పలువురిని కేసులు పెట్టి వేధించింది. చివరకు నాగార్జున బాబును సైతం బ్లాక్ మెయిల్ చేసి ఇబ్బందులు పెట్టడం స్టార్ట్ చేసింది. దీంతో నాగార్జునబాబు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.