మహేష్ – రాజమౌళి కాంబో గురించి వస్తున్న వార్తలు ఫేక్ అట..

మహేష్ - రాజమౌళి కాంబో గురించి వస్తున్న వార్తలు ఫేక్ అట..

సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్‌లో సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి రోజుకో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతోందని తెలిసినప్పటి నుంచి ఫ్యాన్స్ అయితే ఆనందంలో మునిగి తేలుతున్నారు. అప్పటి నుంచి కూడా మహేష్, రాజమౌళిల సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందా అని తెగ ఎదురు చూస్తున్నారు. 

ఈ చిత్రానికి సంబంధించి ఏ అప్ డేట్ వచ్చినా వైరల్ అవుతోంది. మహేష్ కాస్త డిఫరెంట్‌గా కనిపించినా ఆ లుక్ ఈ సినిమా కోసమేనంటూ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఇప్పటి వరకూ మహేష్ చేయని జోనర్‌తో ఈ మూవీ రూపొందనుందని టాక్. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్యాస్టింగ్ గురించి ఒక వార్త వైరల్ అవుతోంది. అదేంటంటే.. క్యాస్టింగ్ డైరెక్టర్ వీరేన్ స్వామి ఈ సినిమాలో భాగమైనట్టు వార్తలొస్తున్నాయి.

చిత్ర నిర్మాణ సంస్థ ఈ వార్తపై స్పందించింది. రాజమౌళి – మహేశ్ బాబు కాంబోకు సంబంధించిన నటీనటుల ఎంపికపై రకరకాల వార్తలు వస్తున్నాయని.. ముఖ్యంగా కొన్ని ఇంగ్లీష్  వెబ్ సైట్స్‌లో వెలువడిన కథనాలు తమ దృష్టికి వచ్చాయని శ్రీ దుర్గ ఆర్ట్స్ తెలిపింది. క్యాస్టింగ్ డైరెక్టర్ వీరేన్ స్వామి తమ సినిమాలో భాగమైనట్టు రాశారని… అయితే ఈ వార్తలో ఎలాంటి నిజమూ లేదని తెలిపింది. తమ నుంచి వస్తే తప్ప ఇతరులెవరి నుంచి ఏ న్యూస్ వచ్చినా నమ్మవద్దని చిత్ర యూనిట్ తెలిపింది.