తిరిగి సొంత గూటికి చేరుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి..

తిరిగి సొంత గూటికి చేరుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి..

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి వైసీపీ గూటికి చేరిపోయారు. ఇవాళ (మంగళవారం) మధ్యాహ్నం వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆయన ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆర్కేకు జగన్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత డిసెంబర్‌లో వ్యక్తిగత కారణాలతో ఆళ్ల రామకృష్ణారెడ్డి వైసీపీని వీడారు. పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవికి సైతం ఆయన రాజీనామా చేశారు.

అయితే ఆర్కే రాజీనామాపై స్పీకర్ మాత్రం ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఇక ఆయన తన రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ షర్మిలతోనేనని ఆయన వెల్లడించారు. పైగా కాంగ్రెస్‌లో చేరారు. అయితే నెల కూడా తిరగకముందే ఆళ్ల రామకృష్ణారెడ్డి తిరిగి సొంత గూటికి చేరిపోయారు. ఆళ్ల తిరిగి వైసీపీలో చేరేందుకు ఆయన సోదరుడు, ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి చక్రం తిప్పారు.

తిరిగి సొంత గూటికి చేరుకున్న ఆళ్ల రామకృష్ణారెడ్డి..

ఈసారి మంగళగిరి టికెట్ ఇవ్వకున్నా పార్టీలో కీలక పదవి ఇస్తారంటూ ఆళ్ల రామకృష్ణారెడ్డికి చెప్పి ఒప్పించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే నేడు అయోధ్య రామిరెడ్డితో కలిసి తాడేపల్లి క్యాంప్ ఆఫీసుకు ఆర్కే వెళ్లారు. అక్కడ సీఎం జగన్‌ను కలిసి తిరిగి పార్టీలో చేరారు. మంగళగిరిలో వైసీపీ గెలుపునకు సహకరించాలని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నియోజకవర్గ బాధ్యతలను ఆర్కేకు అప్పగిస్తారని సమాచారం. మంగళగిరి నియోజకవర్గ ఇన్‌చార్జిగా గంజి చిరంజీవిని వైసీపీ అధిష్టానం నియమించింది.