కేసీఆర్‌దే విజయమనగానే.. కమలం విష ప్రచారం..!

కేసీఆర్‌దే విజయమనగానే.. కమలం విష ప్రచారం..!

సీఎం కేసీఆర్ పార్టీదే విజయమని నిన్న ఒక సర్వే సంస్థ తేల్చిన విషయం తెలిసిందే. సీట్లు కాస్తో కూస్తో తగ్గొచ్చు కానీ విజయం ఆయనదేనని న్యూస్ స్టాప్ అనే సర్వే సంస్థ తేల్చింది. తెలంగాణలో బీఆర్ఎస్‌కు 70 సీట్లు వస్తాయని న్యూస్ స్టాప్ వెల్లడించింది. ఇక కాంగ్రెస్ పార్టీ 30కి పైగా స్థానాల్లో విజయం సాధిస్తుందని తేల్చింది. మొత్తానికి మంచి ఫిగర్‌తోనే గులాబీ పార్టీ విజయం దక్కంచుకుంటుందని సర్వే తేల్చింది. ఈ సమయంలో ఏం చేయాలో పాలుపోని విపక్ష నేతలు స్థానికత అంశాన్ని తెరపైకి తెచ్చాయి.

తెలంగాణలో సీఎం కేసీఆర్ నాన్ లోకల్ అట. వినడానికే విచిత్రంగా అనిపిస్తోంది కదా. బీజేపీ నేత ఒకరు చేస్తున్న ప్రచారమిది. ఎలాగూ తెలంగాణలో జెండా పాతలేమని భావించిన బీజేపీ.. ఇక గులాబీ బాస్ సీటు కిందే ఎసరు పెట్టేందుకు తయారయ్యారు. కామారెడ్డికి సీఎం కేసీఆర్ స్థానికేతరుడని బీజేపీ అభ్యర్థి కాటిపల్లి వెంకట రమణారెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. కాబట్టి కామారెడ్డిలోని ప్రజలంతా స్థానికేతరులను ఓడించి.. స్థానికుడినైన తనకే ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఒక్కరే కాదు.. రాష్ట్రవ్యాప్తంగా పలు పార్టీల అభ్యర్థులందరిదీ ఇదే వరస. తమ ప్రత్యర్థులపై ‘స్థానిక’ అస్త్రాన్ని ఎక్కుపెట్టి తద్వారా లబ్ది పొందాలని చూస్తున్నారు. నిజానికి సీఎం కేసీఆర్ ఏపీకి చెందిన వ్యక్తి అంటూ గతంలోనే ఓ వర్గం మీడియా ప్రచారం నిర్వహించింది కానీ జనాలు వాటిని పట్టించుకోలేదు. ‘నేను ఇక్కడే పుట్టిన.. ఇక్కడే పెరిగిన.. నా కట్టె కాలేవరకూ మీతోనే ఉంటా. ఈ మట్టిలోనే కలిసిపోతా!’ అంటూ కేసీఆర్ ఎప్పటి నుంచో చెబుతున్నారు. ఆ మాటకే ఆయన కట్టుబడి ఉన్నారు కదా. కానీ ఇలాంటి ప్రచారాలు నిర్వహిస్తే అసలుకే ఎసరొస్తుందని నేతలు తెలుసుకోవాలి.