చంద్రబాబు, పవన్ భేటీ.. మూడు కీలక అంశాలపై చర్చ..

చంద్రబాబు, పవన్ భేటీ.. మూడు కీలక అంశాలపై చర్చ..

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ నేడు ములాఖత్ అయ్యారు. చంద్రబాబు నివాసానికి వెళ్లి మరీ పవన్ ఆయనతో భేటీ అయ్యారు. ఇద్దరూ గంటన్నర పాటు పలు కీలక విషయాలపై చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా ఢిల్లీ పర్యటన ఆపై.. ఎన్డీఏలో చేరిక.. ఇది పూర్తైతే బీజేపీతో సీట్ల సర్దుబాటు వంటి విషయాలపై చర్చించినట్టు సమాచారం. అలాగే రెండో జాబితాపై సైతం చంద్రబాబు, పవన్‌లు చర్చించినట్టు తెలుస్తోంది. తొలి జాబితాలో జనసేన 5 స్థానాలను మాత్రమే ప్రకటించింది.

ఇంకా జనసేన 19 స్థానాలను ప్రకటించాల్సి ఉంది. అయితే రాజోలు స్థానాన్ని పవన్ ముందే ప్రకటించారు కాబట్టి ఆ మిగిలిన 18 స్థానాలపై అటు టీడీపీ, ఇటు జనసేనల్లో ఉత్కంఠ సాగుతోంది. టీడీపీ నేతలు.. జనసేనకు ఇచ్చే 18 స్థానాల్లో తమ స్థానం ఎక్కడ ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. ఇక టీడీపీ, జనసేనల మధ్య సమన్వయం కోసం ఒక కమిటీ వేస్తే ఎలా ఉంటుందన్న దానిపై చంద్రబాబు, పవన్‌లు చర్చించినట్టు సమాచారం. అలాగే ఎప్పుడు జాబితాను వెలువరించాలనే విషయంపై కూడా చర్చించారట.

Advertisement

బీజేపీతో పొత్తును ఫిక్స్ చేసుకుని.. సీట్ల సర్దుబాటుపై చర్చించిన మీదట అన్ని సీట్లను ఒకే దఫాలో ప్రకటించాలని చంద్రబాబు, పవన్ డిసైడ్ అయ్యారట. గత రాత్రి చంద్రబాబు.. తన కుమారుడు నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడితో భేటీ అయి అభ్యర్థుల ఎంపికపై చర్చించారట. ఇక ఆ తరువాత మూడవ ఉమ్మడి సభ విషయంలో కూడా చంద్రబాబు, పవన్‌లు ఒక క్లారిటీకి వచ్చారట. ఇక వచ్చే ఎన్నికల్లో కీలకమైన ఉమ్మడి మేనిఫెస్టోను వెంటనే సిద్ధం చేసి విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.