అసెంబ్లీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు..

అసెంబ్లీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు..

ఈసారి ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకచోట భార్యాభర్తలు.. ఇంకోచోట తండ్రీకూతుళ్లు.. మరోచోట బావా మరదళ్లు.. ఇంకొన్ని స్థానాల్లో బాబాయ్‌, అబ్బాయ్‌, అమ్మాయ్‌. రాజస్తాన్‌ అసెంబ్లీ ఎన్నికల సిత్రాలివి. బంధువుల మధ్య రసవత్తర పోరు సాగుతోంది. దాంతారాంగడ్‌లో కాంగ్రెస్ తరుఫున వీరేంద్ర సింగ్.. జన్ నాయక్ జనతా పార్టీ తరుఫున ఆయన భార్య రీటా పోటీ చేస్తున్నారు. ఇదే ఆసక్తికరమంటే.. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. రేంద్ర తండ్రి నారాయణ్‌ సింగ్‌ కాంగ్రెస్‌ అగ్రనేత కావడం.

ధోల్‌పూర్‌లో బీజేపీ తరుఫున శివచరణ్‌ కుష్‌వహా పోటీ చేస్తుండగా.. ఆయన మరదలు శోభారాణి కాంగ్రెస్ పార్టీ తరుఫున పోటీ చేస్తున్నారు. బావామరదళ్ల పోటీ ఆసక్తికరంగా మారింది. ఆళ్వార్‌లో బీజేపీ నుంచి జయరామ్ జాటప్‌కు టికెట్ ఇచ్చింది. అదే స్థానంలో ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఆయన కుమార్తె మీనా కుమారి పోటీ చేస్తున్నారు. తండ్రీకూతుళ్ల మధ్య విభేదాల నేపథ్యంలో కూతురు తండ్రినే సవాలు చేస్తూ స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగింది. భాద్రా అసెంబ్లీ స్థానం బీజేపీ నుంచి సంజీవ్ బెనీవాల్.. కాంగ్రెస్ నుంచి ఆయన అన్న కుమారుడు అజిత్ బెనీవాల్ బరిలోకి దిగారు.

నాగౌర్‌లో బీజేపీ నుంచి జ్యోతీ మీర్ధా పోటీ చేస్తుంటే కాంగ్రెస్‌ తరఫున ఆమెకు బాబాయ్‌ వరసయ్యే హరేంద్ర మీర్ధా బరిలో ఉన్నారు. ఖండార్‌ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ తరఫున అశోక్‌ బైర్వా బరిలో ఉన్నారు. అయితే ఆయన తండ్రి డాల్‌చంద్‌తో ఆయనకు విభేదాలు నడుస్తున్నాయి. కాబట్టి కొడుకుకు వ్యతిరేకంగా తండ్రి ప్రచారం చేస్తుండటం ఆసక్తికరంగా మారింది. తన కొడుకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటేయద్దంటూ డాల్‌చంద్‌ బీభత్సంగా ప్రచారం చేస్తుండటంతో ఏమీ చేయలేక అశోక్‌ తలపట్టుకుంటున్నారు.