పవన్‌కు పెను గండమే.. ఎదుర్కొని నిలుస్తారా?

పవన్‌కు పెను గండమే.. ఎదుర్కొని నిలుస్తారా?

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు బాగా పట్టున్న ప్రాంతం ఉభయ గోదావరి జిల్లాలు. అక్కడ కాపు సామాజిక వర్గం ఎక్కువ. కాబట్టి తమ సామాజిక వర్గానికి చెందిన పవన్‌కు ఉభయ గోదావరి వాసులు బ్రహ్మరథం పడుతున్నారు. అలాంటి ఓ స్థానం నుంచి అదే సామాజిక వర్గానికి చెందిన ఓ నేత వైసీపీ తీర్థం పుచ్చుకుంటే పరిస్థితి ఏంటి? కాపులు రెండు వర్గాలుగా చీలుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఒకవైపు పవన్ కల్యాణ్ మూడు రోజుల పాటు కాకినాడలో మకాం వేసి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి నేతల వరకూ అందరితో సమావేశాలు నిర్వహించి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు యత్నించారు. టీడీపీ నేతలతో సమన్వయం వంటి అంశాలపై తమ పార్టీ కేడర్‌ను సమాయత్తం చేశారు. ఇలాంటి తరుణంలో కాపు ఉద్యమ నేత, కాపు కుల పెద్ద ముద్రగడ పద్మనాభం వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమవుతున్నారు.

నిజానికి ముద్రగడ చాలా కాలంగా వైసీపీకి ఫేవర్‌గానే వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పుడు పూర్తిగా వైసీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని టాక్. ఇప్పటికే ఆయన తన నివాసంలో అనుచరులతో భేటీ అయి వైసీపీలో చేరికపై సమాలోచనలు చేస్తున్నారట. తమ కుమారుడు గిరిబాబుకు వైసీపీ టికెట్ హామీతో ముద్రగడ వైసీపీలో చేరనున్నారట. ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్నేంటంటే.. ముద్రగడ పార్టీ మారితే జనసేన ఓట్లు చీలుతాయా? కాపు సామాజిక వర్గమంతా రెండుగా చీలిపోతుందా? ఇది పెనుగండమైతే పవన్ ఎదుర్కొని నిలుస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.