కడప లోక్‌సభ బరిలో వైఎస్ షర్మిల?

కడప లోక్‌సభ బరిలో వైఎస్ షర్మిల?

ఏపీలో రాజకీయ పరిణామాలు మరింత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ రావడంతో పార్టీలన్నీ ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై మరింత ఫోకస్ పెడుతున్నాయి. ఇప్పటికే వైసీపీ పూర్తి స్థాయిలో అసెంబ్లీ, లోక్‌సభ అభ్యర్థులను ప్రకటించగా.. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సైతం దాదాపుగా అభ్యర్థులను ప్రకటించేసింది. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది.

రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డితోనే అభ్యర్థుల ప్రకటన మొదలుపెట్టాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తోందట. ఈ క్రమంలోనే షర్మిల పోటీ చేసే స్థానం కూడా ఫిక్స్ అయిపోయినట్టు టాక్. కడప లోక్‌సభ స్థానం నుంచి వైఎస్ షర్మిల పోటీచేస్తారని తెలుస్తోంది. ఈ న్యూస్ ఏపీలో సంచలనంగా మారింది. ఇప్పటికే షర్మిల తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై నిప్పులు చెరుగుతున్నారు. ఇప్పుడు జగన్‌ను మరింత ఇరకాటంలో పెట్టాలంటే కడప స్థానం నుంచి షర్మిలను బరిలోకి దింపడమే కరెక్ట్ అని కాంగ్రెస్ భావిస్తోందట.

షర్మిల దృష్టికి ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయాన్ని తీసుకెళ్లగా ఆమె కూడా ఓకే చెప్పినట్టు టాక్. ఈ నెల 25న కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా వెలువడనుందట. ఈ జాబితాలో తొలి పేరు షర్మిలదే ఉంటుందని తెలుస్తోంది. ఈ న్యూస్ నిజమైతే మాత్రం కడప హాట్ టాపిక్ అవుతుందనడంలో సందేహమే లేదు. పైగా ఆ స్థానం నుంచి వైఎస్ అవినాశ్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఆయనను ఎలాగైనా ఈ సారి ఓడించాలని వివేకా కుటుంబం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఈక్రమంలోనే వివేకా కుటుంబమంతా షర్మిలకు మద్దతుగా ప్రచారం నిర్వహించడంలోనూ సందేహం లేదు.