చంద్రబాబుకు ఐటీ నోటీసులు

చంద్రబాబుకు ఐటీ నోటీసులు

తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆదాయ పన్ను శాఖ షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. చంద్రబాబుపై ఇన్ఫ్రా సంస్థల సబ్ కాంట్రాక్టుల ద్వారా రూ. 118 కోట్ల ముడుపులు తీసుకున్నారనే అభియోగాలు వచ్చాయి. ఈ క్రమంలోనే చంద్రబాబుకు ఐటీ శాఖ షోకాజ్ నోటీసులు జారీ చేసిందని ఓ ప్రముఖ జాతీయ మీడియా సంస్థ వెల్లడించింది.

షోకాజ్ నోటీసులపై చంద్రబాబు అభ్యంతరాలను ఐటీ శాఖ తిరస్కరించినట్లు తెలుస్తోంది. అమరావతి కాంట్రాక్టర్లు అయిన షాపూర్జి పల్లోంజి, ఎల్&టి సంస్థల నుంచి సబ్ కాంట్రాక్టుల ద్వారా చంద్రబాబుకు 118 కోట్ల ముడుపులు ముట్టినట్టు ప్రచారం జరిగింది.

Advertisement

బోగస్ సబ్ కాంట్రాక్టు సంస్థల ద్వారా చంద్రబాబు ముడుపులు పొందినట్లు  ఆదాయ పన్ను శాఖ అధికారులు ప్రాథమిక ఆధారాలు సేకరించారు. మనోజ్ వాసుదేవ్ పార్థసాని నివాసాల్లో తనిఖీల సమయంలో చంద్రబాబు ముడుపుల వ్యవహారం బయటడినట్టు తెలుస్తోంది. బోగస్ కాంట్రాక్టులు, వర్క్ ఆర్డర్ల ద్వారా  నగదు స్వాహా చేసినట్లు మనోజ్ వాసుదేవ్ ఒప్పుకున్నారు. 2016లో చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ద్వారా మనోజ్ వాసుదేవ్ టచ్లోకి వెళ్లినట్టు సమాచారం. శ్రీనివాస్ ద్వారానే సబ్ కాంట్రాక్టుల సంస్థల నుంచి చంద్రబాబు ముడుపులు అందుకున్నట్టు తెలుస్తోంది. 

ఈ క్రమంలోనే ఆగస్ట్ 4వ తేదీనే హైదరాబాద్‌ ఐటీ సెంట్రల్‌ సర్కిల్‌ కార్యాలయం సెక్షన్ 153C కింద ఐటీ శాఖ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోఅమరావతిలో సచివాలయం, శాసనసభ, న్యాయస్థానం భవన నిర్మాణాల్లో చంద్రబాబు దోపిడీకి పాల్పడ్డారట్టు వార్తలు వినవస్తున్నాయి. షాపూర్జి పల్లోంజి (ఎస్ పి సి ఎల్), ఎల్ అండ్ టి సంస్థలతో పాటు ఫోనిక్స్ ఇన్ఫ్రా అండ్ పౌర్ ట్రేడింగ్ అనే  సబ్ కాంట్రాక్టు సంస్థ ద్వారా నగదు మళ్లింపు జరిగినట్లు ఈడీ విచారణలో తేలింది. పూర్జీ పల్లోంజీ కంపెనీ కర్నూలు, గుంటూరు, అనంతపురం, పశ్చిమగోదావరిల్లో టిడ్కో ఇళ్లు, అమరా­వతిలో హైకోర్టు, అసెంబ్లీ, సచివాలయం తాత్కాలిక భవనాల నిర్మాణంతో పాటు రాజధానిలో ఇతర నిర్మాణ పనులను కలిపి 2018 నాటికి రూ.8 వేల కోట్ల విలువ చేసే కాంట్రాక్ట్‌ పనులు చేసింది. అప్పుడే ఇంత పెద్ద మొత్తంలో అవినీతి జరిగిందని తెలుస్తోంది.