లోక్‌సభ ఎన్నికలను టార్గెట్ చేస్తున్న కేసీఆర్..

లోక్‌సభ ఎన్నికలను టార్గెట్ చేస్తున్న కేసీఆర్.. లక్ష్యం నెరవేరుతుందా?

బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో అయినా సత్తా చాటాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో 10 ఎంపీ సీట్లకు తగ్గకుండా చూసుకోవడమే టార్గెట్‌గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. బీఆర్ఎస్‌కు ఇప్పుడు 9 మంది ఎంపీలున్నారు. కానీ వచ్చే ఎన్నికల్లో వీరంతా గెలుస్తారా? అన్న అనుమానాలు లేకపోలేదు.

ముఖ్యంగా పెద్దపల్లి, మహబూబ్ నగర్, ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా బీఆర్ఎస్ ఖాతా కూడా తెరవలేకపోయింది. మరి ఈ తరుణంలో ఇక్కడ లోక్‌సభ సీట్లను మాత్రం కైవసం చేసుకోగలుగుతుందా? అనేది సందేహం. ఇక కొన్ని పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో అయితే ఒకట్రెండు స్థానాలకే బీఆర్ఎస్ పరిమితమైంది. అసెంబ్లీ ఎన్నికల పరిస్థితులు రిపీట్ అయితే బీఆర్ఎస్‌కు కష్టమే.

మరోవైపు సీఎంగా రేవంత్ రెడ్డి జనాకర్షక పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. ఇచ్చిన 6 హామీల్లో ఇప్పటికే రెండింటిని నెరవేర్చగా.. మరో హామీని కూడా నెరవేర్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. మరోవైపు రేవంత్ సైతం వీలైనంత మేర సీట్లను రాబట్టుకునేందుకే ప్రయత్నిస్తున్నారు. ఈ తరుణంలో కేసీఆర్ తాను అనుకున్నది సాధించగలరా? అనేది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రేవంత్ రెడ్డి కేసీఆర్ హయాంలో జరిగిన అవకతవకలన్నీ ఒక్కొక్కటిగా బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు.