లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ కీలక నిర్ణయం..

లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కేసీఆర్ కీలక నిర్ణయం..

లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణ రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే లోక్‌సభ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని.. కనీసం 12 సీట్లైనా తమ ఖాతాలో వేసుకోవాలని కాంగ్రెస్ ఆరాటపడుతోంది. ఇక బీఆర్ఎస్ విషయానికి వస్తే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన తప్పిదాలు రిపీట్ కాకుండా చూసుకోవాలని.. ఈ ఎన్నికల్లో అయినా పెద్ద మొత్తంలో సీట్లు సాధించి తమ సత్తా ఏంటో ఇటు కాంగ్రెస్‌కు అటు బీజేపీకి తెలియజేయాలని చూస్తోంది.

ఈ క్రమంలోనే బీఆర్ఎస్ లోక్‌సభ అభ్యర్థుల జాబితాను సైతం సిద్ధం చేస్తోంది. ఇప్పటి వరకైతే.. చేవెళ్ల, కరీంనగర్ బీఆర్ఎస్‌ అభ్యర్థుల విషయంలో మాత్రమే క్లారిటీ వచ్చింది. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, చేవెళ్ల నుంచి రంజిత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. ఆసక్తికర విషయం ఏంటంటే.. లోక్‌సభ ఎన్నికలకు తమ ఫ్యామిలీని మాత్రం దూరంగా ఉంచాలని కేసీఆర్ భావిస్తున్నారట. నిజామాబాద్ నుంచి కవిత పోటీ ఫిక్స్ అంటూ వార్తలు అయితే వినిపించాయి.

తాజాగా ఓ ఆసక్తికర విషయం ప్రచారంలో ఉంది. కేసీఆర్ కుటుంబం నుంచి లోక్‌సభ బరిలో ఎవరూ ఉండరట. తమ కుటుంబమంతా పూర్తి స్థాయిలో రాష్ట్ర రాజకీయాలపైనే ఫోకస్ పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారట. పైగా తమ కుటుంబం నుంచి ఎవరైనా పోటీ చేసి ఓటమి పాలైతే అది పార్టీకి మరింత నష్టం చేకూర్చవచ్చనే ఆలోచన కూడా గులాబీ బాస్ చేసి ఉండొచ్చు. గత ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి కవిత ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలైన విషయం తెలిసిందే. అది రిపీట్ కావొద్దనే లోక్‌సభ బరిలో నిలవొద్దనే నిర్ణయం కేసీఆర్ తీసుకున్నారని సమాచారం.