అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి రఘురామ?

అసెంబ్లీ అభ్యర్థిగా బరిలోకి రఘురామ?

నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు విషయంలో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగు చూస్తున్నాయి. టీడీపీ – జనసేన – బీజేపీ కూటమిలో ఏ పార్టీకి నరసాపురం స్థానం వెళితే ఆ పార్టీ తరుఫున పోటీ చేస్తానంటూ రఘురామ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నరసాపురం టికెట్ బీజేపీకి వెళ్లింది కానీ టికెట్ మాత్రం శ్రీనివాసవర్మకు అధిష్టానం కేటాయించింది. దీంతో రఘురామకు నిరాశే ఎదురైంది. ఆయనకు సీటు దక్కకపోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

నిజానికి బీజేపీ టికెట్ రఘురామకే ఇస్తుందని అంతా అనుకున్నారు. టీడీపీ వర్గాలు సైతం దీనికి సంబంధించిన సంకేతాలు ముందే వచ్చాయని తెలిపాయి. ఏమైందో ఏమో కానీ చివరి నిమిషంలో పార్టీ టికెట్ శ్రీనివాసవర్మకు కేటాయించింది. దీంతో రఘురామను తమ పార్టీలో చేర్చుకుని అసెంబ్లీ టికెట్ అయినా ఇవ్వాలని టీడీపీ యోచిస్తోందని సమాచారం. ఇప్పటికే టీడీపీ దాదాపు అన్ని అసెంబ్లీ సీట్లకు అభ్యర్థులను ఫిక్స్ చేసింది. అయితే ఎవరినైనా నిలిపేసి వారి స్థానంలో రఘురామను నిలిపితే ఎలా ఉంటుందన్న దానిపై టీడీపీ సమాలోచనలు చేస్తోందట.

Advertisement

అసెంబ్లీకి రఘురామకృష్ణరాజు అనేది ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన విషయంలో టీడీపీ అయితే ఒక నిర్ణయానికి వచ్చేసిందట. తొలుత పశ్చిమ గోదావరి జిల్లాలోని ఏదో ఒక స్థానం నుంచి బరిలోకి దింపాలని అనుకున్నారట కానీ ఉత్తరాంధ్ర నేతలు దీనికి అంగీకరించలేదట. అయినా సరే.. బరిలోకి దింపితే వ్యతిరేకత వచ్చే అవకాశముందని భావించిన చంద్రబాబు ఆ ఆలోచనను విరమించుకున్నారట. ఇప్పుడు ఏదో ఒక అసెంబ్లీ స్థానం నుంచి రఘురామతో పోటీ చేయించాలని డిసైడ్ అయ్యారట. ఇక చూడాలి.. ఎవరి అసెంబ్లీ టికెట్‌కు ఎసరొస్తుందో.. ఎవరిని తప్పించి చంద్రబాబు ఆ టికెట్‌ను రఘురామకు ఇస్తారో..