పవన్‌పై అసహనాన్నంతా వెళ్లగక్కిన ముద్రగడ..

పవన్‌పై అసహనాన్నంతా వెళ్లగక్కిన ముద్రగడ..

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌‌పై తన అసహనాన్నంతా చాలా మర్యాదగా కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వెళ్లగక్కారు. ఈ మేరకు నేడు పవన్‌కు ఆయన ఓ లేఖ రాశారు. తనను పవన్ పలుమార్లు కలుస్తానని చెప్పి కలవకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు కవాతు సందర్భంగా కిర్లంపూడి వస్తానని ఒకసారి కబురు పంపారని.. ఆపై అయోధ్య వెళ్ళొచ్చాక కలుస్తానన్నారని కానీ నేటికీ కలవలేదని ముద్రగడ పేర్కొన్నారు. తామిద్దరం కలవాలని యావత్ జాతి బలంగా కోరుకుందని ముద్రగడ తన లేఖలో పేర్కొన్నారు. దీంతో గతం, బాధలు, అవమానాలు, ఆశయాలన్నీ మరిచి పవన్‌తో ప్రయాణం చేసేందుకు సిద్ధపడ్డానన్నారు.

చరిత్ర తిరగరాసినట్టైంది..

Advertisement

రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ వరవడి తీసుకురావడానికి పవన్‌తో కలిసి శ్రమించాలని అనుకున్నానని ముద్రగడ లేఖలో వెల్లడించారు. పవన్ కూడా అదే ఆలోచనతో ఉన్నారని నమ్మానన్నారు. కానీ దురదృష్టవశాత్తు పవన్ తనకు ఆ అవకాశమే ఇవ్వలేదన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు జైలులో ఉన్నప్పుడు మొత్తం టీడీపీ కేడర్ బయటకు రావడానికి భయపడి ఇంచుమించుగా ఇళ్ళకే పరిమితం అయిపోయారని.. అటువంటి కష్టకాలంలో పవన్ జైలుకి వెళ్ళి వారికి భరోసా ఇవ్వడమన్నది సామాన్యమైన విషయం కాదన్నారు. దీంతో చరిత్ర తిరగరాసినట్టు అయ్యిందన్నారు. వారి పరపతి విపరీతంగా పెరగడానికి ఎవరు ఎన్ని చెప్పినా మీరే కారకులని బల్లగుద్ది చెప్పగలనని ముద్రగడ అన్నారు.

లాస్ట్ గ్రేడ్ వ్యక్తినయ్యా..

గౌరవ ప్రజనీకమంతా పవన్‌ను ఉన్నత స్థానంలో చూడాలని తహతహాలాడారని ముద్రగడ పేర్కొన్నారు. పవర్ షేరింగు కోసం ప్రయత్నం చేసి అసెంబ్లీ సీట్లు 80, రెండు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ముందుగా మిమ్మల్ని చేయమని కోరి ఉండాల్సిందని పవన్‌కు తెలిపారు. ఆ సాహసం పవన్ చేయలేకపోవడం చాలా బాధాకరమన్నారు. తన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో డబ్బు కోరడం గానీ, పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయడం గాని చేయలేదన్నారు. భగవంతుడ్ని ఆ పరిస్థితి రాకుండా చేయమని తరచూ కోరుకుంటాన్నానన్నారు. పవన్ మాదిరిగా గ్లామర్ ఉన్నవాడిని కాకపోవడం, ప్రజలలో పరపతి లేనివాడిని అవ్వడం వల్ల ఆయన దృష్టిలో తాను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా.. తుప్పు పట్టిన ఇనుము లాంటి వాడిగా గుర్తింపు పడడం వల్ల వస్తానని చెప్పించి, రాలేకపోయారని పేర్కొన్నారు. మీ నిర్ణయాలు మీ చేతులలో ఉండవని.. ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాలని ముద్రగడ ఎద్దేవా చేశారు. జనసేన పోటీ చేసే 24 మంది కోసం తన అవసరం రాదు .. రాకూడదని భగవంతున్ని ప్రార్ధిస్తున్నానంటూ ముద్రగడ లేఖలో పేర్కొన్నారు.

పవన్‌పై అసహనాన్నంతా వెళ్లగక్కిన ముద్రగడ..