తగ్గేదెలే.. జగన్ ను ఆడుకుంటున్న లోకేష్..!

మీ బిడ్డను.. నేను పేదవాడి పక్షమే అని చెప్పుకునే ఏపీ సీఎం జగన్.. పేదల నోటి దగ్గర కూడు లాగేయడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. అన్నా క్యాంటీన్లను రద్దు చేసి అభాగ్యుల నోటి కాడ కూడు లాగేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఆయన మంగళగిరి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. అయితే నులకపేటలో నారా లోకేష్ ఓ అన్న క్యాంటీన్‌ను అప్పట్లో ఏర్పాటు చేశారు. తాజాగా దాని వద్ద సెల్ఫీ తీసుకున్న ఆయన పై వ్యాఖ్యలు చేశారు. వర్షంలోనే తడుస్తూ నారా లోకేష్ తన పాదయాత్రను నిర్వహిస్తూ ఉండటం విశేషం. ఆయనకు అడుగడుగునా జనం నీరాజనం పలుకుతున్నారు.

సీఎం కుర్చీ కోసం వాడుకుని వదిలేశారు..

వివిధ సామాజిక వర్గాలు, సామాన్య ప్రజలు నారా లోకేష్‌ను కలిసి తమ సమస్యలను విన్నవించుకుంటున్నారు. తాజాగా తాడేపల్లి గేటు కూడలిలో నారా లోకేష్‌ను రెడ్డి సామాజిక వర్గీయులకు కొందరు కలిసి తమ సమస్యలను ఆయనకు చెప్పుకున్నారు. పంటలకు గిట్టుబాటు ధర, రైవస్‌ కాలువపై వంతెన శిథిలావస్థకు చేరడం.. వంటి సమస్యలు ప్రభుత్వానికి చెప్పుకున్నా కానీ పరిష్కారం కావడం లేదని లోకేష్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై నారా లోకేష్ మాట్లాడుతూ.. తన ఇంటిలోని వారికే న్యాయం చేయలేని జగన్ రెడ్డి.. సామాజిక వర్గానికి మాత్రం ఎలా న్యాయం చేస్తారని ప్రశ్నించారు. కేవలం సీఎం కావడం కోసమే సామాజిక వర్గాన్ని వాడుకుని ఆపై వదిలేశారని విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు తాడేపల్లిలో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

అడ్డగోలు పన్నుల విధానాన్ని సమీక్షిస్తా..

అలాగే న్యూఆంధ్రా మోటార్‌ ట్రక్కర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు సైతం నారా లోకేష్‌ను కలిశారు. తమ సమస్యలను తెలియజేస్తూ వినతిపత్రం ఇచ్చారు. తమను పోలీసులు చాలా ఇబ్బంది పెడుతున్నారని.. సరకు ఎగుమతి, దిగుమతి సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. అలాగే డ్రైవింగ్‌ శిక్షణ కోసం ప్రతి జిల్లాలో కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. ఇంధన ధరలు తగ్గించడంతో పాటు అడ్డగోలు పన్నుల విధానాన్ని సమీక్షిస్తామన్నారు. ఇక ఆ తరువాత ఎన్టీఆర్‌ విగ్రహం వద్ద స్త్రీశక్తి ప్రతినిధులతో మాట్లాడారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు.. మహిళల ఆర్థిక స్వావలంబనకు 27 సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు గుర్తుచేశారు. ఇక ఆ తరువాత తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ ఇవ్వడం తదితర కార్యక్రమాలు అందజేస్తామని చెప్పారు.

కనీసం కుర్చీ వేయడం మరిచారు..

ఇక ఆ తరువాత తాడేపల్లిలోని అంబేద్కర్‌ విగ్రహం వద్దకు నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేరుకుంది. అక్కడ అగ్నికుల క్షత్రియ ఐక్యవేదిక నాయకులు ఆయనను కలిసి తమ సమస్యలపై లోకేశ్‌కు వినతిపత్రం ఇచ్చారు. మత్స్యకార సొసైటీలకు చెరువులు, ఇసుక రీచ్‌లు నిర్వహించుకునే అవకాశమివ్వాలని వినతిపత్రంలో కోరారు. మత్స్యకార మహిళలకు సౌకర్యాలతో మార్కెట్లు ఏర్పాటు చేయాలని అడిగారు. కులానికో కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కానీ కనీసం ఒక కుర్చీ వేయడం మరిచారని విమర్శించారు. ఈ సందర్భంగా గతంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పేషీలో ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకుంటే.. కార్యాలయానికి తాళాలు వేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇక జీవో 217 రద్దు చేసి చేపల చెరువులను మత్స్యకార సొసైటీలకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.

ఆసక్తికర విషయం ఏంటంటే..

కాగా.. తాజాగా మంగళగిరి నియోజకవర్గంలో 300 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. డాన్‌బాస్కో పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన పాదయాత్ర విడిది కేంద్రంలో నిడమర్రు, తాడేపల్లి, నవులూరు, ఎర్రబాలెం, మంగళగిరి, కృష్ణాయపాలెం గ్రామాలకు చెందిన నాయకులు లోకేష్‌ను కలిసి ఆయన సమక్షంలో పార్టీ కండువాలు కప్పుకొన్నారు. ఇక తాడేపల్లిలో ఓ ఆసక్తికర విషయం జరిగింది. అప్పట్లో నారా లోకేష్ తాడేపల్లికి వెళ్లిన సమయంలో ఆ ప్రాంతానికి చెందిన రెహానా అనే మహిళ ఏడాది కిందట భర్తను కోల్పోయింది. చంటిబిడ్డతో జీవితాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో అర్థంకాని స్థితిలో ఆమె ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా నారా లోకేష్‌ను కలిసి తన దీన స్థితిని వివరించింది. వెంటనే ఆమెకు లోకేశ్‌ అల్పాహార బండి సమకూర్చారు. పాదయాత్ర రెహానా అల్పాహారం బండి వద్దకు రాగానే ఆమె చాలా సంతోషం వ్యక్తం చేశారు. తన బతుకుదెరువుకు దారి చూపించిన లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మీ దయతో నెలకు రూ.30వేలు సంపాదిస్తున్నానంటూ లోకేష్‌కు అల్పాహారం అందించారు. అంతేకాదు.. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇల్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు.