నెల్లూరు జిల్లాలో ఆసక్తికరంగా రాజకీయ పరిణామాలు.. టీడీపీ నేతలతో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేల భేటీ..!

నెల్లూరు జిల్లాలో ఆసక్తికరంగా రాజకీయ పరిణామాలు.. టీడీపీ నేతలతో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేల భేటీ..!

నెల్లూరు(Nellore) జిల్లాలో రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. నేడు వైసీపీ(YCP) బహిష్కృత ఎమ్మెల్యేలతో టీడీపీ ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు. మరో బహిష్కృత ఎమ్మెల్యే.. యువగళం పాదయాత్రలో భాగంగా నారా లోకేష్‌(Nara Lokesh)ను కలిసి కాసేపు ఆయనతో భేటీ అయ్యారు. నేటి ఉదయం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని టీడీపీ నేతలు మాజీ మంత్రి అమర్నాధ్ రెడ్డి, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర, వేమిరెడ్డి పట్టాభి ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. ఆయనతో పలు విషయాలపై ముచ్చటించారు. ఆయనను టీడీపీలోకి రావాలని ఆహ్వానించారు. నిన్ననే టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)తో మరో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే ఆనం రాం నారాయణరెడ్డి భేటీ(Anam Ramnarayana Reddy) అయ్యారు.

నేడు ఆనంను కూడా టీడీపీ నేతలు కలిశారు. ఇక మరోవైపు నారా లోకేష్‌(Nara Lokesh)తో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రస్తుతం నారా లోకేష్ బద్వేలు నియోజకవర్గం అట్లూరులో పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే లోకేష్‌తో మేకపాటి భేటీ అయ్యారు. వీరిద్దరి మధ్య ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మొత్తానికి ఈ ముగ్గురికీ టీడీపీలోకి వెళ్లేందుకు లైన్ క్లియర్ అయినట్టు తెలుస్తోంది. ఈ నెల 13 నుంచి నారా లోకేష్ యువగళం పాదయాత్ర నెల్లూరు జిల్లాలో కొనసాగనుంది. దీనికి ముందే ఈ ముగ్గురు నేతలను తమ పార్టీలోకి చేర్చుకోవాలని టీడీపీ యత్నిస్తోంది. ఈ క్రమంలోనే టీడీపీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది.

Advertisement