ఇది కదా పాలన.. ఏపీలో సంస్కరణలు భేష్ : నోబెల్ గ్రహీత, ఆర్థికవేత్త మైకేల్ క్రెమెర్ ప్రశంసలు

ఇది కదా పాలన.. ఏపీలో సంస్కరణలు భేష్ : నోబెల్ గ్రహీత, ఆర్థికవేత్త మైకేల్ క్రెమెర్ ప్రశంసలు

ఏపీలో జగన్ పాలన, సంస్కరణలపై నోబెల్ గ్రహీత, ఆర్థికవేత్త మైకేల్ క్రెమెర్ ప్రశంసలు గుప్పించారు. ప్రస్తుతం ఏపీలో విద్య సంస్కరణలు.. విద్యా వికాసానికి .. విద్యార్థులు సర్వతోముఖాభివృద్ధికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధ, బాధ్యత ఖండాంతరాల్లోని మేధావులు, నిపుణులు, విద్యావేత్తలకు సైతం అర్థం అవుతోంది కేవలం రాష్ట్రంలోని ప్రతిపక్ష నేతలకు.. వారికి బాకాలూదే అంధ మీడియాకు తప్ప. ఇప్పటికే మన రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఐరాస సదస్సులో పాల్గొని తమ మేథోపటిమను విశ్వవ్యాప్తం చేశారు. జగన్ ఇచ్చిన స్ఫూర్తితో ఏపీలోని విద్యార్థులు ఆంగ్లంపై ఎంత పట్టు సాధించారో మనకు తెలియనిది కాదు.

వీళ్లు గరీబోళ్ల పిల్లలేనా?

ఒక మారుమూల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మండల కేంద్రానికి వెళ్లి కొత్తవాళ్లతో మాట్లాడడమే చాలా పెద్ద విషయం. వారిలోని ఆత్మన్యూనతాభావం వారి నోటిని కట్టేస్తుంది. కానీ ఏపీ విద్యార్థులు అంతర్జాతీయ వేదికల మీద ప్రసంగాలు దంచేస్తున్నారు. ముఖ్యమంత్రి ముందు సైతం ఎలాంటి తొట్రుపాటు లేకుండా అనర్గళంగా ఆంగ్లంలో ప్రసంగిస్తున్నారు. వీరిని చూస్తుంటే నిజంగా వీళ్ళు గరీబోళ్ల పిల్లలేనా ? ఔరా అని అందరూ చెక్కిట వేలుపెట్టుకుని ఆలోచించే పరిస్థితికి ఎదిగారు. దీనంతటికీ ముఖ్యమంత్రి సీఎం వైయస్ జగన్ తీసుకున్న శ్రద్ధ ప్రధాన కారణమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇది కదా పాలన.. ఏపీలో సంస్కరణలు భేష్ : నోబెల్ గ్రహీత, ఆర్థికవేత్త మైకేల్ క్రెమెర్ ప్రశంసలు

తినే తిండి నుంచి మోసే బ్యాగ్ వరకూ..

ఏదో పథకం ప్రవేశ పెట్టేశామని చేతులు దులిపేసుకునే రకం కాదు సీఎం జగన్. రాష్ట్రంలోని లక్షలాది పిల్లలను తన సొంత బిడ్డల మాదిరి భావించి వాళ్ళు వేసుకునే బూట్ల దగ్గర నుంచి తినే తిండి వరకూ.. మోసే బ్యాగ్ నుంచి టాయిలెట్ల వరకూ అన్నీ దగ్గరుండి, ప్రత్యేక శ్రద్ధతో వాటిని ఎంపిక చేసి పిల్లలకు పంపిణీ చేస్తున్నారు. అమ్మఒడి, గోరుముద్ద, విద్యాకానుక ఇలా ప్రతి పథకాన్ని సమర్థంగా అందిస్తూ ప్రభుత్వ పాఠశాలలను నందనవనాల మాదిరి తీర్చిదిద్దిన జగన్ మోహన్ రెడ్డి పాలనకు వివిధ రాష్ట్రాలు ముచ్చటపడ్డాయి. ఏపీని ఆదర్శంగా తీసుకున్నాయి. ఈ క్రమంలోనే ఏపీకి వచ్చి పాఠశాలలను చూసి వెళ్లాయి. ఇక ఇప్పుడు ఏకంగా నోబెల్ అవార్డ్ గ్రహీత, చికాగో యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ మైకేల్ రాబర్డ్ క్రేమెర్ సైతం ఏపీలోని విద్యాశాఖ పని తీరు చూసి అబ్బురపడ్డారు.

కళ్ల ముందు కనిపిస్తున్నా..!

డెవలప్‌మెంట్ ఇన్నోవేషన్ ల్యాబ్ డైరెక్టర్ కూడా అయిన క్రేమెర్ మన రాష్ట్రంలోని వివిధ పాఠశాలలను సందర్శించేందుకు వచ్చారు. ఈ క్రమంలోనే పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలు, ప్రభుత్వం చూపుతున్న శ్రద్ధను చూసి ముచ్చటపడ్డారు. విద్యార్థుల మనోవికాసానికీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు అభినందనీయమని, ఇలాంటి సంస్కరణలే విద్యార్థులను సమున్నతంగా తీర్చిదిద్దుతాయని అయన కొనియాడారు. ప్రభుత్వ స్కూళ్లలో తీసుకొచ్చిన మార్పులు, విద్యార్థులు సాధిస్తున్న ప్రగతి నిజంగా కళ్ళముందు కనిపిస్తున్న ఓ అద్భుతమైన మార్పు అని అయన చెప్పడం నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి గర్వకారణం.