కూతురి ప్రేమ వివాహాన్ని వైభవంగా జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే

కూతురి ప్రేమ వివాహాన్ని వైభవంగా జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే

ఇటీవలి కాలంలో పరువు హత్యలు బాగా ఎక్కువయ్యాయి. కులం వేరని.. మతం వేరైన వారిని వివాహం చేసుకున్నారంటూ తమ కడుపున పుట్టిన కూతురు, కొడుకులను తల్లిదండ్రులే కడతేరుస్తున్న రోజులివి. ఇలాంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్‌లో ఓ ఎమ్మెల్యే తన కూతురి ప్రేమ వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి దగ్గరుండి మరీ సంప్రదాయబద్దంగా వివాహం జరిపించారు. ప్రస్తుతం ఈ వివాహం ఏపీలో హాట్ టాపిక్‌గా మారింది.

వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తన పెద్ద కూతురు పల్లవి కొంతకాలంగా పవన్ అనే యువకుడిని ప్రేమిస్తోంది. ఈ విషయాన్ని తన కుటుంబ సభ్యులకు పల్లవి చెప్పగా.. వెంటనే అంగీకరించిన శివప్రసాద్ రెడ్డి తన కూతురికి పవన్‌తో వివాహం జరిపించారు. బొల్లవరంలోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో కుటుంబ సభ్యుల నడుమ సంప్రదాయబద్ధంగా వివాహం జరిపించారు. అనంతరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో వారి పెళ్లిని రిజిస్టర్ చేయించారు.

కూతురి ప్రేమ వివాహాన్ని వైభవంగా జరిపించిన వైసీపీ ఎమ్మెల్యే

తన కూతురి వివాహంపై ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ… చదువుకున్న రోజుల్లో ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారని.. డబ్బు, హోదా, కుల గోత్రాలకు పట్టింపు లేకుండా ఇద్దరి ఇష్ట ప్రకారం వివాహం జరిపించినట్లు ఎమ్మెల్యే వివరించారు. వీరిద్దరి కులాలు వేరని తెలిపారు. మొత్తానికి దగ్గరుండి తన కూతురి ప్రేమ వివాహాన్ని జరిపించిన శివప్రసాద్ రెడ్డిపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.