పొత్తు ఫిక్స్.. బీజేపీకి కేటాయించే సీట్లపై క్లారిటీ..

పొత్తు ఫిక్స్.. బీజేపీకి కేటాయించే సీట్లపై క్లారిటీ..

టీడీపీ, జనసేనల కూటమిలోకి బీజేపీ కూడా చేరిపోయింది. గత రాత్రి ఈ పార్టీల మధ్య పొత్తు ఫిక్స్ అయ్యింది. ఎన్డీఏలోకి టీడీపీ చేరిపోయింది. సీట్ల సర్దుబాటుపై సైతం క్లారిటీ వచ్చింది కానీ మరో దఫా సమావేశం అయితే నేడు జరగనుంది. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లు నేడు బీజేపీ పెద్దలతో భేటి కానున్నారు. గత రాత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోమంత్రి అమిత్ షాలతో చంద్రబాబు, పవన్ భేటీ అయ్యారు.

టీడీపీ, జనసేన, బీజేపీ పెద్దల మధ్య దాదాపు 2 గంటలకు పైనే చర్చలు జరిగాయి. బీజేపీకి 6 అసెంబ్లీ స్థానాలు, 4 లోక్‌సభ స్థానాలు ఇచ్చేందుకు టీడీపీ మొగ్గు చూపుతోందని సమాచారం. అయితే బీజేపీ మాత్రం 6 లోక్‌సభ, 10 అసెంబ్లీ స్థానాలు కోరుతోందట. ఇక బీజేపీకి టీడీపీ రాజమండ్రి, అరకు, రాజంపేట, తిరుపతి లోక్‌సభ స్థానాలను ఆఫర్ చేస్తోందని తెలుస్తోంది. అయితే బీజేపీ మత్రం రాజమండ్రి, నర్సాపురం, వైజాగ్, హిందూపూర్, వైజాగ్, అరకు లోక్‌సభ స్థానాలను కోరుతోందట.

ఇక ఎమ్మెల్యే స్థానాల విషయానికి వస్తే.. కైకలూరు, ధర్మవరం, విశాఖ నార్త్ , జమ్మలమడుగు, తిరుపతి, ఉభయ గోదావరి జిల్లాల్లో  ఒక స్థానం ఇవ్వాలని టీడీపీ డిసైడ్ అయ్యింది. అయితే బీజేపీ మాత్రం 2014 లో తాము పోటీ చేసిన స్థానాలన్నీ తిరిగి తమకే ఇవ్వాలని పట్టుబడుతున్నట్టు సమచారం. అయితే తాము ఇస్తామన్న సీట్లలో పోటీ చేస్తే విజయం ఖాయమని..  గెలవలేని సీట్లు తీసుకోవడంవల్ల అక్కడ వైసీపీకి ప్రయోజనం కలుగుతుందని బీజేపీ పెద్దలకు చంద్రబాబు తెలిపారట. టీడీపీ 6 అసెంబ్లీ, 4 లోక్‌సభతో పాటు ఒక రాజ్యసభ కూడా ఆఫర్ చేస్తోందట. ఇవాళ్టి చర్చల తర్వాత పొత్తులపై ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.