టీడీపీ, జనసేనల మధ్య అసలు సీన్ షురూ..!

టీడీపీ, జనసేనల మధ్య అసలు సీన్ షురూ..!

టీడీపీ, జనసేనలు పొత్తు కుదుర్చుకుని చాలా నెలలవుతోంది. కానీ పొత్తు విషయంలో మాత్రం ఇప్పటి వరకూ ఓ క్లారిటీకి అయితే రాలేదు. ఒకవైపు వైసీపీ దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థులను ఫిక్స్ చేసేసింది. ఇప్పటికే నాలుగు జాబితాలను విడుదల చేసిన వైసీపీ.. ఐదో జాబితా విడుదలకు రంగం సిద్దం చేస్తోంది. ఇప్పటికే 60 మంది సిట్టింగ్‌లకు చెక్ పెట్టేసింది. మరో 20 మందికి కూడా చెక్ పెట్టేందుకు సిద్ధమవుతోందని టాక్. మరి టీడీపీ, జనసేనల మాటేంటి?

ఈ నేపథ్యంలోనే టీడీపీ, జనసేన పార్టీల మధ్య అసలు సీన్ అదేనండీ సీట్ల సర్దుబాటుకు వేళైంది. ప్రస్తుతం చంద్రబాబు ‘రా.. కదలిరా’ సభలను నిర్వహిస్తున్నారు. మొత్తం 25 పార్లమెంట్ స్థానాల్లో ఈ సభలు నిర్వహించాలని చంద్రబాబు ఫిక్స్ అయ్యారు. ఈ క్రమంలోనే 17 చోట్ల ఈ ప్రచార సభలు పూర్తయ్యాయి. మిగిలిన 8 చోట్ల సభలు నిర్వహించాల్సి ఉంది. ఈ సభలకు బ్రేక్ తీసుకున్నారు. ఫిబ్రవరి 4 వరకూ తన పర్యటనలకు చిన్న విరామం ప్రకటించారు.

ఈ నాలుగు రోజుల వ్యవధిలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో భేటీ అయ్యి సీట్ల సర్దుబాటు విషయాన్ని తేల్చుకోనున్నారట. ఇప్పటికే చంద్రబాబు ఒక రెండు చోట్ల, జనసేన రెండు చోట్ల అభ్యర్థుల విషయంలో స్పష్టత ఇచ్చేశారు. ఈ క్రమంలో మిగిలిన అన్ని చోట్ల సీట్ల విషయాన్ని తేల్చుకోనున్నారు. వైసీపీ దూకుడుగా వ్యవహరిస్తూ ఉండటంతో ఈ రెండు పార్టీలు సైతం సీట్ల సర్దుబాటు చేసుకుని అభ్యర్థులను ప్రకటించాలని చూస్తున్నాయి. మరి ఈ నాలుగు రోజుల్లో సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కొలిక్కి వస్తుందో రాదో చూడాలి.