టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీళ్లేనట..

టీడీపీ ఎంపీ అభ్యర్థులు వీళ్లేనట..

ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. వైసీపీ తమ అభ్యర్థులకు సంబంధించిన ఐదు జాబితాలను విడుదల చేసింది. అయితే టీడీపీ-జనసేన కూటమి నుంచి ఒక్క జాబితా కూడా విడుదల కాలేదు. అయితే ప్రస్తుతం ఈ పార్టీలు కూడా అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్థుల జాబితాపై కసరత్తు చేస్తున్నాయి. ఈక్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు హైదరాబాద్‌లోనే ఉండి అభ్యర్థుల ఎంపికపై కసరత్తు నిర్వహిస్తున్నారు.

ముందుగా అయితే చంద్రబాబు ఎంపీ స్థానాలపై ఫోకస్ పెట్టారట. ఇప్పటికే సగం మంది పార్లమెంటు అభ్యర్థుల ఎంపిక పూర్తైనట్టు సమాచారం. దీనిలో భాగంగానే 13 స్థానాలకు ఎంపిక పూర్తైనట్టు సమాచారం. వీటిలో జనసేనకు రెండు స్థానాలు కేటాయించారట. మచిలీపట్నం, కాకినాడ స్థానాలను జనసేనకు కేటాయించారని సమాచారం. ఇక వైసీపీన నుంచి బయటకు వచ్చిన ముగ్గురు సిట్టింగ్‌లకు టీడీపీ టికెట్లు కన్ఫర్మ్ చేసిందట.

నరసాపురం నుంచి రఘురామ కృష్ణరాజు, మచిలీపట్నం నుంచి బాలశౌరి, నరసరావుపేట నుంచి శ్రీకృష్ణదేవరాయలకు టికెట్లు ఇస్తున్నారట. అయితే మరో ఎంపీ సీటు కూడా వైసీపీ సిట్టింగ్‌కేనని సమాచారం. 13 స్థానాల్లో 4 ఎంపీ సీట్లు వైసీపీ నుంచి వచ్చిన వారికే పోతే.. ఇక అసెంబ్లీ సీట్లలో ఎన్ని పోతాయోనని టీడీపీ నేతలు ఆందోళన చెందుతున్నారట. ఈ క్రమంలోనే నియోజకవర్గాల్లో కార్యకర్తలతో బలప్రదర్శన కూడా చేస్తున్నారట. ఇక జనసేనకు ఇచ్చిన రెండు సీట్లలో కాకినాడ నుంచి సాన సతీష్ కుమార్, మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరి పోటీ చేస్తారని తెలుస్తోంది.