పొత్తులతో వచ్చినా.. కత్తులతో వచ్చినా మరోసారి జగనే..!

పొత్తులతో వచ్చినా.. కత్తులతో వచ్చినా మరోసారి జగనే..!

పొత్తులతో వచ్చినా.. కత్తులతో వచ్చినా.. చెల్లెలిని రంగంలోకి దింపినా.. ఎన్ని అడ్డుకట్టలు వేసినా ఈసారి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనాన్ని ఎవరూ అడ్డుకోలేరని తాజాగా ఓ సర్వే సంస్థ న్యూస్ ఎరీనా తేల్చింది. ఈ సర్వే ప్రస్తుతం ఏపీలో సంచలనంగా మారింది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ ప్రిపోల్ సర్వే విపక్షాలకు దడ పుట్టిస్తుండగా.. అధికార పార్టీలో మాత్రం జోష్ నింపుతోంది. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించిన సర్వే ఆధారంగా ఎరీనా సంస్థ ఫలితాలను వెలువరించింది.

డిసెంబర్ 1, 2023 నుంచి జనవరి 12, 2024 తేదీ వరకు ఈ సర్వే నిర్వహించినట్టుగా న్యూస్ ఎరీనా తెలిపింది. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలతో పాటు శాంతి భద్రతలు, ప్రభుత్వం అందించిన సేవలు, రాష్ట్రానికి ప్రత్యేక మోదా, ఎమ్మెల్యేల పనితీరు, మూడు రాజధానులు, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్, టీడీపీ-జనసేన పొత్తు వంటి అంశాలను ఎజెండాగా తీసుకుని ఈ సర్వే నిర్వహించినట్టు న్యూస్ ఎరీనా తెలిపింది. వచ్చే ఎన్నికల్లో కొన్ని సీట్లు తగ్గినా కూడా వైసీపీదే విజయమని తేల్చింది. వైసీపీ 49.14 శాతం ఓటింగ్ తో సుమారు 122 అసెంబ్లీ నియోజకవర్గాల్లో విజయకేతనం ఎగరవేయనుందని న్యూస్ ఎరీనా వెల్లడించింది.

పొత్తులతో వచ్చినా.. కత్తులతో వచ్చినా మరోసారి జగనే..!

అలాగే పొత్తులో ఉన్న టీడీపీ – జనసేన 44.34 శాతంతో 53 స్థానాల్లో విజయం సాధించే అవకాశముందని సర్వే తేల్చింది. కాంగ్రెస్ 1.21 శాతం, బీజేపీ 0.56 శాతం ఓట్లను సాధిస్తుందని న్యూస్ ఎరీనా సర్వే వెల్లడించింది. ఇక జగన్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలపై 59.3 శాతం మహిళలు, 49.6 శాతం పురుషులు జగన్ పాలనకు మద్దతుగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహించినా ఇవే ఫలితాలు వస్తాయని న్యూస్ ఎరీనా సర్వే స్పష్టం చేసింది. మొత్తానికి ఈ సర్వే మాత్రం జగన్‌కు, వైసీపీకి మంచి బూస్ట్ అయితే ఇస్తోంది. జగన్ ఒంటరి పోరుకు కొండంత బలాన్ని ఇస్తోంది.