ఎంపీ అభ్యర్థుల కోసం అల్లాడుతున్న టీడీపీ.. అంతా స్వయంకృతమే..

ఎంపీ అభ్యర్థుల కోసం అల్లాడుతున్న టీడీపీ.. అంతా స్వయంకృతమే..

టీడీపీ పరిస్థితి రోజురోజుకీ అస్తవ్యస్తంగా తయారవుతోంది. కనీసం ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు అభ్యర్థులు లేక అల్లాడుతోంది. ముగ్గురు సిట్టింగ్ ఎంపీలది తలోదారి అయిపోయింది. విజయవాడ ఎంపీ కేశినేని నాని వచ్చేసి పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించేశారు. ఇక గుంటూరు ఎంపీ గల్లాజయదేవ్ పార్టీకి చాలా కాలంగా దూరంగా ఉంటున్నారు. పైగా ఈసారి పోటీ చేయబోనని తేల్చేశారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు ఈసారి అసెంబ్లీ బరిలో దిగాలని భావిస్తున్నారు. మొత్తానికి టీడీపీ నుంచి పోటీ చేసేందుకు ఎంపీ అభ్యర్థులే దొరకడం లేదు. దీంతో ఎంపీ అభ్యర్థుల ఎంపిక ప్రహసనం టీడీపీకి తలనొప్పిగా తయారైంది. పైకి మాత్రం దూకుడుగా కనిపిస్తోంది కానీ క్షేత్రస్థాయిలో అంతా డొల్లే. ఇక పార్టీని లేపేందుకు ఎల్లో మీడియా ఎంతగానో శ్రమిస్తోంది కానీ ఫలితం లేదు.

సిట్టింగ్ ఎంపీలే ఆసక్తి కనబరచకుంటే మిగిలిన నేతలు మాత్రం ఎందుకు ఆసక్తి కనబరుస్తారు? దీంతో టీడీపీ పరిస్థితి గందరగోళంగా మారింది. పోనీ మిగిలిన ఎంపీ నియోజకవర్గ స్థానాల్లో అయినా పరిస్థితి బాగుందా? అంటే అక్కడ కూడా అంతంత మాత్రంగానే ఉంది. రెండేసి సార్లు విజయం సాధించిన ఎంపీలే ఆసక్తి కనబరచకుంటే మిగిలిన వాళ్లు మాత్రం ఎందుకు ముందుకు వస్తారు? దీంతో టీడీపీకి ఎంపీ అభ్యర్థులు దొరకడం చాలా కష్టంగా మారింది. అంతేకాకుండా చంద్రబాబు సైతం టార్గెట్స్ ఎక్కువగా పెడుతున్నారన్న టాక్ ఉండటంతో అభ్యర్థులు ఎంపీ బరిలో నిలిచేందుకు భయపడుతున్నారట.
రాయలసీమలో తిరుపతి స్థానం నుంచి పోటీలో ఉండే సినీనటుడు శివప్రసాద్ మరణంతో అక్కడ పార్టీకి సరైన అభ్యర్థి ఇప్పటికీ దొరకడం లేదు.

చివరకు చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరు ఎంపీ స్థానానికి కూడా అభ్యర్థి దొరకడం చాలా కష్టంగా మారిందట. ఇక కర్నూలు నుంచి గత ఎన్నికల్లో కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి పోటీ చేశారు కానీ ఈసారి ఆయన కూడా నో చెబుతున్నారని టాక్. అలాగే నరసరావుపేట నుంచి పోటీ చేసిన రాయపాటి, బాపట్ల నుంచి పోటీ చేసిన మాల్యాద్రి శ్రీరామ్‌లు పార్టీకి దూరంగా ఉంటున్నారు. కడపలోనూ పోటీ చేసే అభ్యర్థి దొరకడం చాలా కష్టంగా మారింది. ఇలా 25 నియోజకవర్గాల్లో సగానికిపైగా స్థానాల్లో ఎంపీ అభ్యర్థులను వెదికి పట్టుకోవడం టీడీపీకి కష్టతరంగా మారిందని సమాచారం. అందునా ఈసారి టీడీపీ పరిస్థితి మరింత దిజరాడంతో పార్టీలో నాయకులెవరూ ఎంపీలుగా పోటీ చేయడానికి ముందుకు రావడం లేదట. దీంతో పక్క పార్టీల్లో ఉన్న నాయకులు ఎవరైనా  వస్తారా? అని చంద్రబాబు ఆశగా ఎదురు చూస్తున్నారట. ఇక చూడాలి ఈ పరిస్థితులను చంద్రబాబు ఎలా అధిగమిస్తారో..