ఈసారి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్న సినిమాలు..

ఈసారి ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనున్న సినిమాలు..

ఈ సారి ఏపీ ఎన్నికల్లో సినిమాలు సైతం కీలక పాత్ర పోషించబోతున్నాయి. నిజానికి ఈ ట్రెండ్‌కు వైసీపీ శ్రీకారం చుట్టింది. గత ఎన్నికల సమయంలో సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేత యాత్ర సినిమా తీయించి ఎన్నికల ముందు రిలీజ్ చేసి హడావుడి చేసింది. దీంతో వైసీపీకి ఆర్జీవీ ఆస్థాన దర్శకుడిగా మారిపోయారు. ఇప్పుడు మరో సినిమా తీయించి రిలీజ్ చేయించేందుకు సిద్ధమైంది. ఇప్పుడు యాత్రకి సీక్వెల్‌తో పాటు వ్యూహం సినిమా కూడా విడుదలకు సిద్ధంగా ఉంది.

ఇక తెలుగుదేశం పార్టీ ఏమైనా తక్కువ తిన్నదా? ఈసారి తాము కూడా ఓ సినిమాను తీసి రిలీజ్ చేస్తామంటూ ‘రాజధాని ఫైల్స్’ అనే సినిమాను రూపొందించింది. ఏపీ ప్రభుత్వ విధానాలు, గుడివాడ కేసినో, ఏపీ రాజధాని, రైతుల ఆవేదన, పోరాటాలను వివరిస్తూ ఓ ప్రముఖ మీడియా సంస్థ ‘రాజధాని ఫైల్స్’ పేరుతో సినిమాలు తీశాయి. ఇక ఇటు వైసీపీ తీయించిన సినిమాలు.. అలాగే టీడీపీ తీయించిన సినిమాల తాలుకూ ట్రైలర్స్ కూడా విడుదలయ్యాయి. ఇవి ఒకదాన్ని మించి ఒకటి వ్యూస్ రాబట్టాయి.

‘వ్యూహం’ ట్రైలర్‌కు దాదాపు 6 మిలియన్ వ్యూస్ రాగా, రెండు రోజుల క్రితం విడుదలైన యాత్ర-2 ట్రైలర్‌కు 5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. రాజధాని ఫైల్స్ ట్రైలర్‌కు మాత్రం కొన్ని గంటల్లోనే ఏకంగా 7 మిలియన్ దాకా వ్యూస్ వచ్చాయి. అయితే ఈ మూడింటికీ వస్తున్న స్పందన మాత్రం హాట్ టాపిక్‌గా మారింది. మొత్తానికి ఈసారి ఎన్నికల్లో సినిమాలే ప్రచారాస్త్రాలుగా మారబోతున్నాయనడంలో సందేహం లేదు. అయితే ఏ సినిమాకు జనాదరణ మరింత ఎక్కువ దక్కుతుందో.. ఏ సినిమా అత్యంత ప్రభావవంతమైన ప్రచారాస్త్రంగా మారుతుందో తెలియాల్సి ఉంది.