ఏపీలో రంజుగా రాజకీయం.. గెలిచేదెవరు? ఓడేదెవరు?

ఏపీలో రంజుగా రాజకీయం.. గెలిచేదెవరు? ఓడేదెవరు?

ఓటమిని ఎదుర్కొని నిలదొక్కుకోవడమంటే సామాన్య విషయం కాదు. గతంలో ప్రజారాజ్యం పార్టీ 30కి పైగా స్థానాల్లో విజయం సాధించి కూడా డీలా పడింది. అధికారంలోకి రాలేమని భావించిందో మరొకటో కానీ ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేశారు. ప్రజారాజ్యంతో పోలిస్తే జనసేన పార్టీ ఒకే ఒక్క సీటు సాధించింది. ఏపీలో రెండు చోట్ల పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక్కచోట కూడా విజయం సాధించలేకపోయారు.

అయినా సరే.. పవన్ వెనుకడుగు వేయలేదు. నిత్యం రాజకీయాల్లోనే ఉన్నారు. ప్రజల పక్షాన పోరాడారు. ఓటమి వేదన లేదని కాదు కానీ దాన్ని అధిగమించారు. ఫలితంగా ఈసారి పరిస్థితులు మారిపోయాయి. జనసేన బాగా పుంజకుంది. దీనికి టీడీపీ కూడా తోడైంది. ఇక పవన్ ఓడిపోయే ప్రసక్తి అయితే లేదు. పక్కాగా విజయం సాధిస్తారు. ఇక వైసీపీ కూడా కామ్‌గా ఏమీ లేదు. పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడ బలమైన అభ్యర్థిని నిలబెట్టాలని భావిస్తోంది.

ఈసారి మంచి మెజారిటీ సాధించి ప్రత్యర్థులకు ఝలక్ ఇవ్వాలని జనసేన.. అసలు జనసేనను గెలవనివ్వకూడదని వైసీపీ.. మొత్తానికి ఏపీ రాజకీయం మంచి రంజుమీదుంది. దీనికోసం ఇరు పార్టీలు వ్యూహ రచన చేస్తున్నాయి. ఏపీలో తాము గెలవాలనేది సెకండరీ టార్గెట్. ముందుగా ప్రత్యర్థి పార్టీని ఓడించాలన్న లక్ష్యంతోనే పార్టీలు పావులు కదుపుతుంటాయి. దీనికి ఏ రాజకీయ పార్టీ కూడా అతీతం కాదు. ఈ రాజకీయ క్రీడలో గెలిచేదెవరో.. ఓడెదెవరో చూడాలి.