వైసీపీ రెబల్ నేతల చూపు.. జనసేన వైపు.. కారణమేంటంటే..

వైసీపీ రెబల్ నేతల చూపు.. జనసేన వైపు.. కారణమేంటంటే..

జనసేన పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు సమాయత్తమవుతోంది. పోయిన సారి మాదిరిగా కేవలం ఒక్కటే కాకుండా.. ఈసారి సీట్లు బాగానే గెలుచుకోవచ్చన్న అంచనాలు సర్వత్రా ఉన్నాయి. పొత్తులో భాగంగా జనసేనకు ఎన్ని సీట్లు వస్తాయో యేమో కానీ ఆ పార్టీలో మాత్రం వచ్చిన సీట్లకైనా పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులు లేరన్నది మాత్రం నిజం. దీనిని చాలామంది నేతలు వినియోగించుకోవాలనుకుంటున్నారు. ముఖ్యంగా అధికార పార్టీలో టికెట్ దక్కదనుకున్న నేతలంతా వైసీపీ వైపు చూస్తున్నారు.

టీడీపీలో నేతలు మెండుగానే ఉన్నారు. వారిని కాదని ఆ పార్టీ ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికి పట్టం కట్టదు. ఈ నేపథ్యంలో వైసీపీలో టికెట్ దక్కని నేతలకు జనసేన ది బెస్ట్ ఆప్షన్‌గా కనిపిస్తోంది. సొంత బలంతో పాటు పొత్తుల వల్ల యాడ్ అయిన బలంతో ఈజీగా గెలవవచ్చని వైసీపీ రెబల్ నేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే కాపులంతా జనసేనకు ఫుల్ సపోర్ట్‌గా ఉన్నారు. అలాగే వైసీపీ ఆవిర్భావం నుంచి ఉండి.. రెండు సార్లు ఎంపీగా గెలిచిన వల్లభనేని బాలశౌరి ఈసారి జనసేన వైపు చూస్తున్నారు. ఈయనకు ఎంపీ సీటు ఫిక్స్ అయినట్టు టాక్.

అటాగే కొణతాల రామకృష్ణ.. అనకాపల్లి నుంచి ఎంపీగా రెండు సార్లు.. మంత్రిగా ఒకసారి పని చేశారు. వైఎస్సార్ భక్తుడు. వైసీపీలో ఇమడలేక ఆయన కూడా జనసేనను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి వైసీపీలో టికెట్ దక్కని సీనియర్స్ చూపంతా జనసేన పైనే ఉంది. పొత్తులో భాగంగా టీడీపీ 30 ఎమ్మెల్యే.. 5 ఎంపీ స్థానాలు అడగాలని జనసేన భావిస్తున్నట్టు తెలుస్తోంది. వీటన్నింటికీ సరిపడా అభ్యర్థులైతే ప్రస్తుతానికి ఆ పార్టీలో లేరు. ఈ క్రమంలోనే ఆ పార్టీలోకి వలసలు ఊపందుకుంటున్నాయి.