టీడీపీ నీచ రాజకీయాలు బట్టబయలు చేసిన వైసీపీ.. స్వాతిరెడ్డి గురించి అసలు విషయం తెలిస్తే..!

స్వాతిరెడ్డి

దేశంలోనే సీనియ‌ర్ రాజ‌కీయ నాయ‌కుడినని, 45 ఏళ్ళుగా రాజ‌కీయాల్లో ఉన్నాన‌ని, సెల్‌ఫోన్‌లను భార‌త‌దేశానికి తీసుకొచ్చానని, స‌ముద్రాన్ని సైతం కంట్రోల్ చేయ‌గ‌ల‌న‌ని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన డప్పు తానే కొట్టుకుంటూ ఉంటారు. నిజానికి ఆయ‌న రాజ‌కీయ చరిత్రంతా వెన్నుపోట్ల మయమనే ఆరోపణలు కోకొల్లలు. 2019లో వైఎస్ జగన్ సునామీ ముందు టీడీపీ నిలబడలేక చిత్తుచిత్తుగా ఓడిపోయింది. ఇక అప్పటి నుంచి తన నీచ రాజకీయాలను మళ్లీ మొదలు పెట్టారు. ప్రస్తుత తరుణంలో సీఎం వైఎస్ జ‌గ‌న్‌ను ప్రజాక్షేత్రంలో ఎదుర్కోవడం కష్టమని తేలడంతో చంద్రబాబు నీచ రాజ‌కీయాలు ప‌రాకాష్టకు చేరాయి. దీనికి ఉదాహరణే స్వాతిరెడ్డి అలియాస్ శ్వేతా చౌదరి ఉదంతం… అంటూ వైసీపీ ఆరోపిస్తోంది.

అసలేంటీ పంచాయితీ..?

Advertisement

ఇటీవలి కాలంలో స్వాతిరెడ్డి పేరుతో ఓ మహిళ సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. అయిన దానికి.. కాని దానికి ఏపీ ప్రభుత్వంపై విరుచుకుపడుతూ తన అక్కసు వెల్లగక్కుతోంది. అందుకే తగ్గట్టుగానే వైసీపీ అభిమానులు స్వాతికి దిమ్మతిరిగేలా కౌంటర్ ఇస్తుండటంతో మరింత రెచ్చిపోయింది. తాను యూకేలో ఉంటానని.. ఏపీ ప్రభుత్వం కానీ.. పోలీసులు కానీ తనను ఏమీ చేయలేరంటూ ఇష్టానుసారంగా రెచ్చగొడుతూ మరిన్ని పోస్టులు పెట్టింది. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో వైసీపీ సోష‌ల్ మీడియాను ఎదుర్కోలేమ‌ని టీడీపీకి అర్థమైందని వైసీపీ అభిమానులు అంటున్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు త‌న‌దైన నీచ రాజ‌కీయాల‌కు తెర‌తీశారని, ఇందులో భాగంగా స్వాతిరెడ్డితో సీఎం వైఎస్ జ‌గ‌న్ కుటుంబ స‌భ్యుల మీద‌, మ‌హిళా మంత్రుల మీద అస‌భ్యక‌ర‌మైన పోస్టులు పెట్టించాడు అంటూ వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.

ఇదీ బాబు నిజస్వరూపం..! అంటున్న వైసీపీ

తొలుత స్వాతిరెడ్డి వెనుక చంద్రబాబు ఉన్నారని ఎవరూ ఊహించలేదు. కేవలం టీడీపీపై అభిమానంతో పోస్టులు పెడుతోందని భావించారు. నాలుగు రోజుల క్రితం సీఎం జగన్ కుటుంబ సభ్యులపై సైతం స్వాతిరెడ్డి అసభ్యకర పోస్టులు పెట్టింది. వైసీపీ అభిమానులు స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో మహిళనని కూడా చూడకుండా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారంటూ విక్టిమ్ కార్డ్ బయటకు తీసింది. ఇక తాజాగా స్వాతిరెడ్డికి తాను అండగా నిలుస్తానని చంద్రబాబు చెప్పడంతో అసలు విషయం బయటపడింది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. స్వాతిరెడ్డి అని చెప్పుకుంటూ టీడీపీకి భజన చేస్తున్న ఆ మహిళ అసలు పేరు శ్వేతా చౌదరి. చంద్రబాబు సైతం స్వాతి రెడ్డి అనే ఫేక్ పేరుపైనే ట్వీట్ చేయడం చూస్తుంటే ఇదంతా చంద్రబాబు డైరెక్షన్‌లో జరుగుతోందని స్పష్టమవుతోంది. చూశారుగా.. ఎన్నికలు సమీపిస్తుండటంతో టీడీపీ ఎలాంటి కుయుక్తులు పన్నుతుందో.. ఏపీ ప్రజలరా తస్మాత్ జాగ్రత్త అని నెటిజన్లు, వైసీపీ కార్యకర్తలు సూచిస్తున్నారు.