లోకేష్కు ఇక చుక్కలే.. ఎక్కడ చూసినా ఫిర్యాదులే..!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ పాదయాత్ర ఏ రోజు ప్రారంభించారో.. ఆ రోజు నుంచి ఏదో ఒక్క వివాదమే. స్థానికంగా ఉన్న నేతలపైన.. సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపైనా.. ప్రభుత్వంపైన ఇలా తీవ్ర వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఆఖరికి బూతులు తిట్టిన సందర్భాలు కూడా కోకొల్లలు. అంతేకాదు.. వైఎస్ జగన్ను వ్యక్తిగతంగా విమర్శించిన పరిస్థితులున్నాయ్.
మరీ ముఖ్యంగా ఇటీవల కొద్దిరోజులుగా లోకేష్ చేస్తున్న ప్రసంగాలు, ప్రకటనలు, వార్నింగ్లు ఆయన్ను చిక్కుల్లోకి నెట్టేసేలా ఉన్నాయి. ఎవరి మీద ఎక్కువ కేసులు ఉంటే వాళ్లకు అంత పెద్ద నామినేటెడ్ పదవి ఇస్తాం కాబట్టి మీరు పోరాడండి.. కొట్లాడండి అంటూ టీడీపీ కార్యకర్తలకు లోకేష్ పిలుపునికిచ్చారు. దీనిపట్ల వైసీపీ సోషల్ మీడియా భగ్గుమంది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న వైసీపీ కార్యకర్తలు, సోషల్ మీడియా విభాగం ఏపీలో ఎక్కడికక్కడ ఫిర్యాదులు చేసింది.
ఫిర్యాదుల పర్వం..!
‘ఒక రాజకీయనాయకుడై ఉండి కార్యకర్తలను హింసవైపు నడిపిస్తారా ? రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగితే ఎవరు బాధ్యులు ? ఇదేనా నాయకుడి తీరు’ అని వైసీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. లోకేష్ తీరుతో కార్యకర్తలు రెచ్చిపోయి ప్రభుత్వం మీద, అధికారుల మీద వైసీపీ కార్యకర్తలమీద దాడులకు దిగితే ఎవరు నిలువరిస్తారు..? ఇలా హింసను ప్రేరేపించే లోకేష్ మీద , పార్టీ జాతీయాధ్యక్షుడు చంద్రబాబు, అచ్చెన్నాయుడు మీద చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు.
జిల్లాల్లోని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఆయా పోలీస్ స్టేషన్లకు వెళ్లి పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. చంద్రబాబు ఆనాడు రెచ్చగొట్టినందునే తంబళ్లపల్లె, పుంగనూరు, మాచర్ల వంటి ప్రాంతాల్లో అల్లర్లు చెలరేగాయని, ఈ ఘటనల్లో పలువురు పోలీసులు గాయపడ్డారని దీనికి టీడీపీ నాయకత్వమే కారణమని వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.
సమాజంలో శాంతియుత జీవనానికి విఘాతం కలిగించేలా లోకేష్ ప్రకటనలు ఉంటున్నాయని, ఈ నేపథ్యంలో అయన మీద కేసునమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీస్ స్టేషన్లకు వెళుతున్న సోషల్ మీడియా కార్యకర్తలు ఫిర్యాదులు చేస్తున్నారు.
యువనేతా.. రౌడీనా..?
రాజకీయాల్లో ఎంతో ఓపిక, వినయం అంతకుమించి ప్రజలకు సేవ చేయాలనే గుణం ఉండాలి కానీ.. యువనేత అని పిలిపించుకుంటున్న లోకేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల కొందరు సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు కూడా తిట్టి పోస్తున్న పరిస్థితి. మరోవైపు.. లోకేష్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వైసీపీ దుమ్ము లేపుతోంది. యువనేతకు కౌంటర్గా గట్టిగానే కామెంట్స్ చేసేస్తున్నారు కార్యకర్తలు. ఇప్పుడు లోకేష్పై ఫిర్యాదులు చేశారు సరే.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు..? లోకేష్ కామెంట్స్ను ఖాకీలు ఎలా తీసుకుంటారు..? అనేదానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.